అది క్షమించరాని తప్పిదం : సూర్య

24 Mar, 2020 08:55 IST|Sakshi

పెరంబూరు: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ కల్లోలం సృష్టిస్తున్న తరుణంలో దాన్ని అడ్డుకోవడానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాయి. అయితే ఇందుకు సహకరించాల్సిన బాధ్యత కూడా ప్రజలపై చాలా ఉంది. తమను తాము రక్షించుకోవడానికి ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ మాత్రం నిర్లక్ష్య ధోరణిని వహించరాదు. ఇదే విషయంపై పలువురు సెలబ్రిటీలు ప్రజల్లో అవగాహన కల్పించుందుకు ప్రయత్నిస్తున్నారు. నటుడు సూర్య కూడా కరోనా వైరస్‌ను నిరోధించడానికి ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వీడియోను విడుదల చేశారు.

‘కరోనా వైరస్‌ ఊహించిన దానికంటే వేగంగా వ్యాపిస్తోంది. దీనిపై ప్రజల్లో అవగాహన కలిగించాలి. వరదలు, తుపాన్‌లు, జల్లికట్టు వంటి వాటి విషయంలో రోడ్డెక్కి పోరాడాం. ఇప్పుడు కనిపించని కరోనా మహమ్మారిపై ఇంట్లో ఉండే పోరాడుదాం. చైనా కంటే ఇటలీలోనే కరోనా కారణంగా  ప్రాణనష్టం అధికంగా జరిగింది. దాన్ని తీవ్రతను గ్రహించకుండా బయట తిరిగిన అక్కడి ప్రజలే అందుకు కారణం. ఇండియా మరో ఇటలీ కాకూడదు. ఒక మనిషి మరో మనిసికి కనీసం మీటరు దూరంలో ఉండేలా జాగ్రత్త పడాలి. బయటకు వెళ్లి వస్తే కాళ్లూ, చేతులు కడుక్కోకుండా ఇంట్లోకి వెళ్లకూడదు. తెలియకుండా కూడా ముఖాన్ని చేతులతో అంటుకోకూడదు. జ్వరం,దగ్గు ఉన్నవాళ్లంతా కరోనా వైరస్‌ సోకినవాళ్లు కాదు. అయినా అలాంటి వారు తొలి 6 రోజులు ఏకాంతంగా గడిపి అప్పుడు కూడా తగ్గకపోతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరాలకు గానీ, ఆస్పత్రులకు గానీ వెళ్లి వైద్య చికిత్స పొందాలి. అలా ఆస్పత్రికి వెళ్లిన వారు అత్యవసర పరిస్థితి అయితేనే బయటకు వెళ్లాలి. ఇది సురక్షితంగా కుటుంబంతో ఉండాల్సిన కాలం. 10 రోజు లుగా బాధితుల సంఖ్య 150 మంది గానే ఉండగా గత 24 గంటల్లో 250కి చేరింది.  వయసు మళ్లిన వారు, పిల్లలను జాగ్రత్తగా చూసుకుందాం’ అని నటుడు సూర్య పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు