సినీ రంగానికి నూతన ఆర్టిస్టులు అవసరం

26 Apr, 2019 07:04 IST|Sakshi

పూరి జగన్నాథ్‌  

సిటీబ్యూరో: ‘‘ ఫిలిం ఇండస్ట్రీకి ఎప్పటికప్పుడు నూతన నటీనటులు కావాలి. నా చేతుల మీదుగా ప్రారంభించిన  మయూఖ టాకీస్‌ ఫిలిం యాక్టింగ్‌ స్కూల్‌ మంచి ఆర్టిస్టులను అందిం చగలదన్న నమ్మకం ఉంది’’ అని దర్శకుడు పూరి జగన్నాథ్‌ అన్నారు. నటుడు ఉత్తేజ్‌ హైదరాబాద్‌ ఎల్లారెడ్డి గూడలో ఏర్పాటు చేసిన మయూఖ టాకీస్‌ యాక్టింగ్‌ స్కూల్‌ను పూరి జగన్నాథ్‌ జ్యోతి ప్రజ్వ లన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉత్తేజ్‌ 32 ఏళ్లుగా నాకు మంచి మిత్రుడని  రామ్‌గోపాల్‌ వర్మకు పరిచయం చేసి, నేను దర్శకుడు కావటానికి కారకుడయ్యాడని చెప్పారు. నటుడిగా, రచయితగా, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా, యాక్టింగ్‌ కోచ్‌గా ఉత్తేజ్‌కు ఉన్న అనుభవం అపారమని అన్నారు.

మా అబ్బాయి ఆకాష్‌కు కూడా ఉత్తేజ్‌ దగ్గరే శిక్షణ ఇప్పించానని చెప్పారు. ఉత్తేజ్‌ మాట్లాడుతూ.. సమర్థులు, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ దొరికినప్పుడు మాత్రమే ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్స్‌ విజయవంతం అవుతా యన్నారు. పూరి జగన్నాథ్‌ , కృష్ణవంశీ, సురేందర్‌ రెడ్డి, జె.డి.చక్రవర్తి, నందినీరెడ్డి వంటి దర్శకుల ప్రోత్సాహంతోనే స్కూల్‌ను ప్రారంభించాన్నారు. తొలి బ్యాచ్‌కి 32 అప్లికేషన్స్‌ రాగా కేవలం 18 మందిని మాత్రమే తీసుకున్నామని చెప్పారు. సీనియర్‌ ఫిలిం జర్నలిస్ట్‌ ప్రభు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నటుడు, దర్శకుడు జేడీ చక్రవర్తి, ప్రముఖ రచయిత లక్ష్మీ భూపాల్, మ్యాంగో మ్యూజిక్‌ అండ్‌ మ్యాంగో న్యూస్‌ అధినేత రామకృష్ణ వీరపనేని, ప్రముఖ రచయిత నడిమింటి నరసింహారావు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు