మెగాఫోన్‌ పట్టిన మరో ఛాయాగ్రాహకుడు

30 Jul, 2017 01:15 IST|Sakshi
మెగాఫోన్‌ పట్టిన మరో ఛాయాగ్రాహకుడు

తమిళసినిమా: ఛాయాగ్రాహకులు దర్శకులుగా అవతారమెత్తడం అన్నది చాలా కాలంగానే వస్తోంది. దివంగత ప్రఖ్యాత కెమెరామెన్‌ బాలుమహేంద్ర దర్శకుడిగానూ పలు కళాఖండాలను తెరపై ఆవిష్కరించిన విషయం తెలిసిందే.అదే విధంగా కేవీ.ఆనంద్, మిజయ్‌ మిల్టన్‌ వంటి ఛాయాగ్రాహకులు సక్సెప్‌ఫుల్‌ దర్శకులుగా రాణిస్తున్నారు.తాజాగా పీజీ.ముత్తయ్య వారి బాటలో పయనానికి రెడీ అయ్యారు.ఈయన దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి మదురైవీరన్‌ అనే టైటిల్‌ను నిర్ణయించారు.

వి.స్టూడియోస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సీనియర్‌ నటుడు, డీఎండీకే నేత విజయకాంత్‌ రెండవ కొడుకు షణ్ముగ పాండియన్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈయన ఇంతకు ముందు సహాబ్ధం అనే చిత్రం ద్వారా పరిచయమైన విషయం తెలిసిందే. కాగా మదురై వీరన్‌ చిత్రంలో నవ నటి మీనాక్షి కథానాయకిగా నటిస్తున్నారు. ఇతర ప్రధాన పాత్రలో సముద్రకని, వేల్‌.రామమూర్తి, మైమ్‌గోపీ, పీఎల్‌.తేనప్పన్, మారిముత్తు, నాన్‌కడవుల్‌ రాజేంద్రన్, బాలసరవణన్‌ నటిస్తున్నారు.

ఇప్పటికే కొంత భాగం చిత్రీకరణను పూర్తి చేసుకున్న మదురై వీరన్‌ చిత్ర తుది భాగాన్ని ఆగస్టులో మదురైలో చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు పీజీ.ముత్తయ్య తెలిపారు.ఈయనే ఛాయాగ్రహణం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రం గురించి తెలుపుతూ ఇది జల్లికట్టు నేపథ్యంలో రూపొందిస్తున్న కథా చిత్రం అని తెలిపారు.ఇందులో విదేశం నుంచి సొంత ఊరుకు తిరిగొచ్చే యువకుడిగా షణ్ముగపాండియన్‌ నటిస్తున్నారని చెప్పారు. దీనికి  సంతోష్‌ దయానిధి సంగీతాన్ని అందిస్తున్నారు.ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను శనివారం నటుడు విజయకాంత్‌ ఆవిష్కరించారు.