విమల్‌తో వైగైపులి

29 Apr, 2018 10:30 IST|Sakshi

తమిళసినిమా: యువ నటుడు విమల్‌తో కలిసి వైగైపులి వడివేలు నవ్వించడానికి సిద్ధమవుతున్నారు. ఇంసై అరసన్‌ 24ఆమ్‌ పులికేసి చిత్ర వ్యవహారంలో విమర్శలు ఎదుర్కొంటున్న హాస్యనటుడు వడివేలుపై రెడ్‌ కార్డు పడుతుందనే ప్రచారం జోరుగా సాగుతున్న తరుణంలో ఆయన మాత్రం అలాంటి వాటిని అస్సలు పట్టించుకోకుండా కొత్త చిత్రాల్లో నటించడానికి సిద్ధం అవుతున్నారు. తాజాగా నటుడు విమల్‌తో కలిసి నటించనున్నారు. నటుడు విమల్‌ కథానాయకుడిగా నటించి నిర్మించిన మన్నర్‌ వగైయరా చిత్రం మంచి సక్సెస్‌ను అందించడంతో ఈయన కూడా ఇప్పుడు జోరు పెంచారు.

మన్నర్‌ వగైయరా చిత్ర సక్సెస్‌తో పలువురు ప్రముఖ, యువ దర్శకులు విమల్‌తో చిత్రాలు చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే చిత్రాల ఎంపిక విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్న విమల్‌ ఈ ఏడాది అరడజను చిత్రాల్లో నటించడానికి రెడీ అవుతున్నారు. దర్శకుడు ఎళిల్‌తో కలిసి ఒక చిత్రం, సురాజ్‌ దర్శకత్వంలో ఒక చిత్రం చేయడానికి రెడీ అయ్యారు. సురాజ్‌ దర్శకత్వంలో పోలీస్‌అధికారి పాత్రలో నటించనున్నారు. ఇందులో వడివేలు ప్రధాన పాత్రలో నవ్వించడానికి రెడీ అవుతున్నారు.

వెట్ట్రివేల్‌ చిత్రం ఫేమ్‌ వసంతమణి, తమిళన్‌ చిత్రం ఫేమ్‌ మజిత్‌ దర్శకత్వంలోనూ విమల్‌ నటించడానికి అంగీకరించారు. అదేవిధంగా మన్నర్‌ వగైయరా చిత్రం ఫేమ్‌ భూపతి పాండియన్‌ దర్శకత్వంలో మళ్లీ నటించనున్నారు. ఇలా ఈ ఏడాది ఆయన డైరీ ఫుల్‌ అయిపోయింది. ప్రస్తుతం నటిస్తున్న కన్నిరాశి చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇందులో నటి వరలక్ష్మీశరత్‌కుమార్‌ నాయకిగా నటిస్తున్నారు. సర్గుణం దర్శకత్వంలో నటిస్తున్న కలవాణి 2 చిత్ర షూటింగ్‌ జరుగుతోంది. చిత్రపరిశ్రమ సమ్మె కారణంగా నిలిచిపోయిన కలవాణి 2 చిత్రం మే 3 నుంచి మళ్లీ మొదలుకానుంది.

మరిన్ని వార్తలు