అవన్నీ రూమర్స్‌ అంటున్న హీరోయిన్

31 Mar, 2019 10:07 IST|Sakshi

అలా అని ఎవరు చెప్పారు? అని ప్రశ్నిస్తోంది నటి అంజలి. బహు భాషా నటిగా చాలా కాలంగా రాణిస్తున్న తెలుగమ్మాయి అంజలి. మధ్యమధ్యలో లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు కూడా చేసేస్తున్న అంజలి తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఆ మధ్య నటుడు జైతో ప్రేమ కలాపాలు అనే ప్రచారానికి అవకాశం కల్పించింది. ఇద్దరూ వంటింటి వరకూ వెళ్లి దోసెలు వేసుకుని తినిపించుకున్న ఫొటోలతో పత్రికల్లోకెక్కారు. అలా ఇక పెళ్లే తరువాయి అనుకునేంతలో అసలు తమ మధ్య ఏం లేదు అని స్టేట్‌మెంట్స్‌ ఇచ్చేశారు.

ఆ విషయాన్ని జనం మరిచిపోయారో లేదో గానీ, నటి అంజలి పెళ్లి చేసుకోవడానికి సినిమాలకు దూరం అవనున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. అయితే ఈ ప్రచారాన్ని నటి అంజలి ఖండించింది. దీని గురించి ఆమె స్పందిస్తూ తాను డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా జీవితాన్ని ప్రారంభించి, ఆ తరువాతనే నటినయ్యానని చెప్పింది. నిజానికి తన తల్లికి నటినవ్వాలన్నది ఆశ అని, అది నెరవేరకకపోవడంతో తనను నటిని చేసి తన కలను నెరవేర్చుకుందని చెప్పింది.

తాను వివాహం చేసుకోవడానికి సినిమాలకు స్వస్తి చెప్పనున్నాననే ప్రచారం జరుగుతోందని అంది. అలా అని ఎవరు చెప్పారు? అని ప్రశ్నించింది. అది పూర్తిగా అవాస్తవం అని పేర్కొంది. ఇంకా చెప్పాలంటే అసలు పెళ్లి అన్న వార్తే అబద్దం అని అంది. ఒకవేళ వివాహం చేసుకున్నా, సినిమాలకు ఎందుకు దూరం అవ్యాలి అని ప్రశ్నించింది. తాను నటిగా కొనసాగాలని ఆశిస్తున్నాను. అందుకు గ్లామరస్‌గా నటించడానికి కూడా సిద్ధమేనని అంది. అయితే కథానాయకి ప్రాముఖ్యత ఉన్న పాత్రల్లో నటించాలని ఆశిస్తున్నాననీ చెప్పింది.

కొత్తగా వచ్చే నటీమణులకు తానిచ్చే సలహా ఏమిటంటే నటనపై పూర్తిగా దృష్టి పెట్టి నటించాలని చెప్పింది. నటనపై ఆసక్తి ఉండాలని అంది. సాధించాలనే పట్టుదల ఉండాలని పేర్కొంది. ఇకపోతే తాను ఇతరులను బాధించే విధంగా మాట్లాడుతున్నానని చెప్పుకుంటున్నారని, అందులో నిజం లేదని అంది.

తానింత వరకూ ఎవరినీ కించపరిచేలా మాట్లాడలేదని, తన గురించి ప్రచారం అయ్యే వదంతులకు ప్రారంభ దశలో ఆవేదన కలిగిన విషయం నిజమే కానీ ఇప్పుడు అలాంటి వాటిని అస్సలు పట్టించుకోవడం లేదని నటి అంజలి చెప్పింది. ప్రస్తుతం ఆ అమ్మడు కోలీవుడ్‌లో రెండు మూడు చిత్రాల్లో నటిస్తోంది. అందులో శశికుమార్‌తో నటించిన నాడోడిగళ్‌–2 చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది.

మరిన్ని వార్తలు