‘సైలెన్స్’కోసం అమెరికాకు..

16 May, 2019 07:10 IST|Sakshi

చెన్నై : సైలెన్స్‌ కోసం హీరోయిన్‌ అనుష్క అమెరికాకు పరిగెట్టడానికి సిద్ధం అవుతోంది. ఏంటీ అర్థం కాలేదా? ఈ స్వీటీ నటనకు దూరం అయి చాలా కాలమైంది. దక్షిణాదిలో అగ్రనటిగా వెలుగొందుతున్న ఈ బ్యూటీ దాదాపు రెండేళ్లకు పైగా ముఖానికి రంగేసుకోకపోవడం విశేషమే. అందుకు కారణం తన దృడకాయమే. ఇంజి ఇడుప్పళగి చిత్రంలోని పాత్ర కోసం స్లిమ్‌కు చిరునామాగా ఉండే అనుష్క బరువెక్కిన విషయం తెలిసిందే. అది ఎంత అంటే సుమారు 100 కిలోల బరువు పెరగడంతో అది ఆ తరువాత తన కెరీర్‌కు భారంగా మారింది. అదే బరువుతో భాగమతి చిత్రం చేసి విజయాన్ని అందుకున్నా, ఆ తరువాత పెరిగిన బరువును తగ్గించుకోవడానికి చేయని ప్రయత్నం లేదు. ఎలాగైతేనేం నిరంతర శ్రమతో మళ్లీ యథాస్థితికి మారి కొత్తందాలను సంతరించుకుంది. అయితే ఈ ప్రహసం పూర్తి కావడానికి రెండేళ్లు పైనే పట్టింది. దీంతో భాగమతి తరువాత అనుష్క మరో చిత్రం చేయలేదు. అది తను తీసుకున్న నిర్ణయం కావచ్చు, సరైన అవకాశాలు వచ్చి ఉండకపోవచ్చు.

అలాంటిది ఎట్టకేలకు ఒక చిత్రానికి పచ్చజెండా ఊపింది. ఆ చిత్రం పేరే సైలెన్స్‌. ఇది తమిళం, తెలుగు, హిందీ అంటూ మూడు భాషల్లో తెరకెక్కనుంది. మాధవన్‌ హీరోగా నటిస్తున్న ఇందులో అనుష్కతో పాటు, అంజలి, షాలినిపాండే ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఇది సస్పెన్స్, థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందనుందని సమాచారం. కాగా దీని షూటింగ్‌ను అధిక భాగం అమెరికాలో నిర్వహించనున్నారు. నిజానికి ఈ చిత్రం షూటింగ్‌ కోసం చిత్ర యూనిట్‌ గత ఫిబ్రవరిలోనే అమెరికా వెళ్లాల్సిందట.

అయితే అనుష్కకు వీసా రావడంలో జాప్యం జరగడంతో వాయిదా వేసినట్లు సమాచారం. ఇప్పుడు అనుష్కకు వీసా సిద్ధం అవడంతో త్వరలోనే సైలెన్స్‌ చిత్ర యూనిట్‌ అమెరికాకు బయలుదేరనుందని తెలిసింది. అనుష్క రెండు అనే చిత్రంతో నటుడు మాధవన్‌కు జంటగా తొలిసారిగా కోలీవుడ్‌కు కథానాయకిగా పరిచయమైంది. ఆ తరువాత ఇప్పుడు మరోసారి ఆయనతో కలిసి నటించనుంది. అన్నట్టు ఈ బ్యూటీ తాను స్లిమ్‌గా మారిన విధానాన్ని ఒక పుస్తకంగా రాసిందట. దాన్ని ఆంగ్ల భాషలో త్వరలో విడుదల చేయనుందట. ఇక పోతే తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో జూనియర్‌ ఎన్‌టీఆర్, రామ్‌చరణ్‌ కలిసి నటిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో కీలక పాత్రల్లో నటించబోతోందన్న ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. అయితే అందులో వాస్తవం లేదని అనుష్క వర్గాలు పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు