సాక్షి, ముంబై: దివంగత నటి దివ్యభారతి తల్లి మీటా భారతి కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆమె ఏప్రిల్ 20న స్వగృహంలో కన్నుమూశారు. ఈ వార్త కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దివ్యభారతి కజిన్, నటి కైనాత్ ఆరోరా ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. 19 ఏళ్ల వయసులో నటి దివ్యభారతి చనిపోయిన విషయం తెలిసిందే. కూతురి హఠాన్మరణంతో డిప్రెషన్లోకి వెళ్లిపోయిన మీటా అనారోగ్యం బారిన పడ్డారు. చివరకు కూతురు చనిపోయిన పాతికేళ్లకు ఇప్పుడు మీటా కన్నుమూశారు. 1993 ఏప్రిల్ 5న ముంబై వెర్సోవాలోని తాను ఉంటున్న అపార్ట్మెంట్ నుంచి పడిపోయి నటి దివ్యభారతి మృతి చెందారు. ఆమె మృతిపై అనుమానాలు నెలకొనగా.. తలకు బలమైన గాయం కారణంగానే ఆమె చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు.