జయ్‌సేతుపతితో మరోసారి..

24 Jul, 2017 02:53 IST|Sakshi
జయ్‌సేతుపతితో మరోసారి..

తమిళసినిమా:  విజయ్‌సేతుపతితో నాల్గవసారి జత కడుతోంది నటి గాయత్రి. ఇంతకుముందు నడువుల కొంచెం పక్కత్తు కానోమ్, రమ్మీ, పురియాద పుదిర్‌ చిత్రాల్లో నటించారు. వీటిలో నడువుల కొంచెం పక్కత్తు కానోమ్‌ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. రమ్మీ సుమారుగా ఆడినా, పురియాద పుదిర్‌ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఇంకా తెరపైకి రాలేదు.కాగా మధ్యలో కోలీవుడ్‌లో కనిపించని నటి గాయత్రి తాజాగా ఉలా అనే చిత్రంలో నటిస్తోంది.

తాజాగా విజయ్‌సేతుపతితో కలిసి మరో సారి రొమాన్స్‌ చేయడానికి రెడీ అయ్యింది. వీరిద్దరు కలిసి నటిస్తున్న ఈ చిత్రానికి ఒరు నల్ల నాళ్‌ పార్తు సొల్రేన్‌ అనే పేరును నిర్ణయించారు. 7సీ.ఎంటర్‌టెయిన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, అమ్మా నారాయణ ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రం ద్వారా నవ దర్శకుడు ఆర్ముగకుమార్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇందులో మరో కథానాయకుడిగా గౌతమ్‌కార్తీక్‌ నటిస్తుండగా, ఇంకో నాయకిగా టాలీవుడ్‌ నటి నిహారిక కొణెదల నటిస్తున్నారు.

ఇప్పటికే టాలీవుడ్‌లో నాయకిగా పరిచయమైన ఈమె ఈ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నారు. ఇకపోతే విజయ్‌సేతుపతి ఈ చిత్రంలో ట్రైబల్‌ నాయకుడు యమన్‌గా వైవిధ్యభరిత పాత్రను పోషిస్తున్నారని, 8 గెటప్‌లలో కనిపించనున్నారని సమాచారం. అదే విధంగా గౌతమ్‌కార్తీక్‌ సిటీ యువకుడిగా నటిస్తుండగా గాయత్రి ప్రాముఖ్యత ఉన్న పాత్రను పోషిస్తోందట. ఇందులో తన ఆదివాసీ డాన్స్‌ హైలెట్‌గా ఉంటుందంటోంది గాయత్రి.

>