షూటింగ్‌ నుంచి వెళ్లిపోయిన హీరోయిన్‌..

19 Sep, 2017 12:14 IST|Sakshi
షూటింగ్‌ నుంచి వెళ్లిపోయిన హీరోయిన్‌..

తిరువొత్తియూరు(తమిళనాడు): సినిమా షూటింగ్‌ జరుగుతుండగా నటి పూనంకపూర్‌ ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోవటంతో షూటింగ్‌ అర్ధాంతరంగా ఆగిపోయింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు నిర్మాత తెలిపారు. నెంజి ఇరుక్కుంవరై, పయనం, ఉన్నైపోల్‌ ఒరువన్, వెడి, నాయకి వంటి తదితర చిత్రాలలో నటించిన పూనం నండు అనే చిత్రంలో నటించేందుకు ఒప్పందం చేసుకున్నారు. శనివారం చిత్ర షూటింగ్‌ జరుగుతున్న సమయంలో ఎవరికీ చెప్పకుండా వెళ్లి పోవడంతో షూటింగ్‌ ఆగిపోయినట్లు డైరక్టర్‌ తెలిపారు. దీనిపై చిత్ర తయారీ డైరక్టర్‌ ఆండాల్‌రమేష్‌ మాట్లాడుతూ...

రమేష్‌ హీరోగా, ఇద్దరు హీరోయిన్లతో నిర్మితమవుతున్న నండు చిత్రంలో పూనం కపూర్‌ ఒకరు. 'తన కాస్ట్యూమ్స్‌ను తానే డిజైన్‌ చేసుకుంటానని చెప్పి నిర్మాతకు ఖర్చు భారం పెంచారు. షూటింగ్‌ సమయంలో ఆమె బస చేసేందుకు స్టార్‌ హోటల్‌లో గది ఇప్పించాం. తొలిరోజు చిత్ర షూటింగ్‌లో హఠాత్తుగా తన వద్ద (డైరెక్టర్‌) తక్కిన వారి వద్ద గొడవ చేశారు. తరువాత ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారు. దీంతో నిర్మాతకు లక్షల రూపాయలు నష్టం ఏర్పడింది. ఈ విషయంపై పూనంతో సెల్‌ఫోన్‌లో సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆమె తిరస్కరించారు. ఆమెపై సంఘంలో ఫిర్యాదు చేయడానికి నిర్ణయించుకున్నాం' ఆండాల్‌ రమేష్‌ తెలిపారు.