ఆ ఇద్దరితో నటించాలి

25 May, 2016 03:27 IST|Sakshi
ఆ ఇద్దరితో నటించాలి

ఆ ఇద్దరితో నటించాలని ఆశగా ఉంది అంటోంది వర్ధమాన నటి మృదుల. తమిళ సినిమా విజయ పయనంలో కేరళ రాష్ట్రానికి చెందిన కథానాయికలకు భాగం ఉందని చెప్పడంలో అతిశయోక్తి ఉండదు. నాటి ప్రఖ్యాత నటీమణులు లలిత, పద్మిణి, రాగిణిల నుంచి నేటి ప్రముఖ తారలు నయనతార, కీర్తీసురేశ్‌ల వరకూ పలువురు నాయికలు కోలీవుడ్ విజయాల్లో భాగం పంచుకుంటున్నవారే. తాజాగా ఆ కోవలో వర్ధమాన నటి మృదుల చేరనున్నారు. భరతనాట్యం, మోడలింగ్ రంగాల్లో ప్రవేశం కలిగిన ఈ సుందరి మంచి వ్యాఖ్యాత కూడా. మాతృభాషలో అయాల్ నానళ్ల అనే చిత్రంలో ఫాహత్‌కు జంటగా కథానాయికగా పరిచయమై పలువురి ప్రశంసలు పొందిన మృదుల తాజాగా కోలీవుడ్‌పై కన్నేశారు.

పెద్దయ్యాక ఏం చేయాలనుకుంటున్నావని అడిగిన వారికి నటిని అవుతానని తడుముకోకండా చెప్పాదానినని, అలా బాల్యం నుంచే నటనే లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెబుతున్న మృదుల తమిళ సినిమాలంటే చాలా మక్కువ అని చెప్పుకొచ్చారు. ఇప్పటికీ తమిళ సినిమాలు ఒక్కటి కూడా వదలకుండా చూస్తానంటున్న ఈ కేరళ కుట్టి తమిళ హీరోలపై ప్రేక్షకులు చూపించే ఆదరాభిమాలనకు ఆకర్షితురాలినయ్యానన్నారు. తనకు మాత్రం శివకార్తికేయన్, విజయ్‌సేతుపతిలకు జంటగా నటించాలని చాలా ఆశగా ఉందన్నారు. వారి నటన, కథలను ఎంచుకుని నటించే విధానం తనకు నచ్చిందన్నారు.ఆ ఇద్దరితో నటించే అవకాశాల కోసం ఎదురు చూస్తున్నానని అంటోంది ఈ భామ.