నిక్కీగల్రాణితో రొమాన్స్‌కి సై అంటున్న జీవా

19 Aug, 2016 02:35 IST|Sakshi
నిక్కీగల్రాణితో రొమాన్స్‌కి సై అంటున్న జీవా

 నటుడు జీవాతో తొలిసారిగా రొమాన్స్‌కు సిద్ధమయ్యారు నటి నిక్కీగల్రాణి. వీరిద్దరూ కలిసి నటించే చిత్రానికి కీ అనే టైటిల్‌ను ఖరారు చేశారు చిత్ర దర్శక నిర్మాతలు. ఇంతకు ముందు నాడోడిగళ్, ఈటీ, మిరుదన్ వంటి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన గ్లోబల్ ఇన్ఫోటెయిన్‌మెంట్ సంస్థ అధినేత మైఖేల్‌రాయప్పన్ ప్రస్తుతం శింబు హీరోగా ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో అన్భానవన్ అసరాధవన్ అడంగాధవన్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
  తాజాగా జీవా, నిక్కీగల్రాణి జంటగా కీ అనే చిత్రానికి శ్రీకారం చుట్టారు. మరో నాయకిగా అనైక సోటీ నటిస్తున్నారు. నూతన దర్శకుడు కలీస్ కథ, కథనం, దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. ఈయన దర్శకుడు సెల్వరాఘవన్ శిష్యుడన్నది గమనార్హం. ఈ కీ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రల్లో ఆర్‌జే.బాలాజీ, మలయాళ నటుడు పద్మసూర్య, రాజేంద్రప్రసాద్, సుహాసిని, మీరాకృష్ణన్, మనోబాలా నటిస్తున్నారు.
 
 విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందిస్తున్న ఆ చిత్రం పూజాకార్యక్రమాలతో గురువారం ప్రారంభమైంది. స్నేహితుని స్నేహితుడు తనకూ స్నేహితుడే అన్న కాన్సెప్ట్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని ఒకే షెడ్యూల్‌లో ఏకధాటిగా షూటింగ్‌ను పూర్తి చేయనున్నట్లు చిత్ర దర్శక నిర్మాతలు వెల్లడించారు.