కోలీవుడ్‌లో పాగాకు తహతహ

6 Aug, 2017 02:25 IST|Sakshi
కోలీవుడ్‌లో పాగాకు తహతహ

తమిళసినిమా: కోలీవుడ్‌లో పాగా వేయడానికి నటి రాశీఖన్నా తహతహలాడుతోంది. ఇప్పటికే ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు టాలీవుడ్‌లో హీరోయిన్‌గా బాగానే పాపులర్‌ అయ్యింది. అయితే బహుభాషానటిగా రాణించాలని ఆశిస్తోందట. ఆ దిశగా ప్రయత్రాలు ముమ్మరం చేసింది. అందాలారబోతకు ఏమాత్రం వెనుకంజవేయని రాశీఖన్నా అనుష్క, సమంత, కాజల్‌అగర్వాల్‌ల వంటి ప్రముఖ కథానాయికల బాటలో పయనం మొదలెట్టింది.

తొలుత బాలీవుడ్‌లో రంగప్రవేశం చేసి ఆ తరువాత తెలుగు చిత్రసీమలోకి ప్రవేసించిన ఈ అమ్మడు తాజాగా కోలీవుడ్‌పై దృష్టిసారించింది. ఇక్కడ యువ నటులు సిద్దార్థ్‌ తో సైతాన్‌ కా బచ్చా చిత్రంలోనూ, నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న ఇమైకా నోడిగళ్‌ చిత్రంలో అధర్వకు జంటగానూ నటిస్తోంది. వీటిలో ఇమైకా నోడిగళ్‌ చిత్రం వచ్చే నెలలో తెరపైకి రావడానికి రెడీ అవుతోంది.

కాగా కోలీవుడ్‌లో స్టార్‌ హీరోలతో రొమాన్స్‌ చేసే అవకాశాల వేట మొదలెట్టిందట. గత వారం చెన్నైకి వచ్చిన రాశీఖన్నా ఇక్కడి ప్రముఖ దర్శకులను కలిసి చాన్సుల కోసం ప్రయత్నించిందట. త్వరలోనే స్టార్‌ హీరోలతో కలిసి నటిస్తాననే ధీమాను వ్యక్తం చేస్తోంది. పనిలో పనిగా మలయాళంలోనూ నటించేస్తోంది. అక్కడ మోహన్‌లాల్‌ కథానాయకుడిగా నటిస్తున్న విలన్‌ చిత్రంతో రంగప్రవేశం చేసింది. తదుపరి శాండిల్‌వుడ్‌పై దృష్టి పెడుతుందేమో.