రమ్యానంబీశన్‌కు పెళ్లయ్యిందా?

19 Dec, 2019 08:49 IST|Sakshi

సినిమా: నటి రమ్యానంబీశన్‌ పెళ్లి చేసుకుందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. కోలీవుడ్‌లో రామన్‌ తేడియ సీత, ఆట్టనాయగన్, ఇళైంజన్‌ కుళ్లనరి కూట్టం, పిజ్జా, సేతుపతి చిత్రాల్లో నటించిన నటి రమ్యానంబీశన్‌. ప్రస్తుతం విజయ్‌ఆంటోనీకి జంటగా  తమిళరసన్‌ చిత్రంతో పాటు కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. అదేవిధంగా ఈ కేరళా కుట్టి ఇటీవల మలయాళంలోనూ నటిస్తోంది. కాగా ఇటీవల ఈ అమ్మడు పట్టు చీర ధరించిన ఫొటోలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేసింది. ఆ ఫొటోలిప్పుడు వైరల్‌ అవ్వడంతో పాటు నటి రమ్యానంబీశన్‌ రహస్యంగా పెళ్లి చేసుకుందనే ప్రచారం హోరెత్తుతోంది. దీంతో కొందరు ఆమెకు ఫోన్లో శుభాకాంక్షలు చెప్పేస్తున్నారు.

దీంతో షాక్‌అయిన రమ్యానంబీశన్‌ తనకు పెళ్లి అయ్యిందా అని ఆశ్యర్యాన్ని వ్యక్తం చేస్తూ తన ఫేస్‌బుక్‌లో పేర్కొంది. అందులో మీరు ప్రేమలో పడ్డారా? పెళ్లెప్పుడు చేసుకుంటారు? ఎలాంటి భర్తను కోరుకుంటున్నారు? అంటూ చాలా మంది అడుగుతున్నారన్నారు. అలాంటి సమయంలో తాను పట్టుచీర కట్టిన ఫొటోలను పోస్ట్‌ చేయడంతో పెళ్లి చేసుకున్నట్లు ప్రచారం చేస్తున్నారంది. నిజానికి ఆ ఫొటోలను బద్రి వెంకటేశ్‌ దర్శకత్వం వహించనున్న చిత్రం కోసం తీసినవి అని చెప్పింది. నిజానికి తనకు పెళ్లి జరగలేదని, పెళ్లి చేసుకున్నట్టు తానెవరికీ చెప్పలేదని, ఇదంతా పుకార్లు మాత్రమేనని వివరణ ఇచ్చి తన పెళ్లి వదంతులకు ఫుల్‌స్టాప్‌ పెట్టింది. అంతేకాదు ప్రస్తుతం సినమాలపైనే దృష్టి సారిస్తున్నాననీ, ఇప్పట్లో పెళ్లి ఆలోచన తనకులేదనీ చెప్పుకొచ్చింది. 

మరిన్ని వార్తలు