సంజన వర్సెస్‌ వందన 

29 Dec, 2019 08:42 IST|Sakshi

పోలీస్‌ స్టేషన్‌ మెట్లెక్కిన పార్టీ గొడవ  

తారస్థాయికి చేరిన రచ్చ 

పరస్పర ఆరోపణలు, ఫిర్యాదులు

శాండిల్‌వుడ్‌లో హాట్‌ టాపిక్‌ 

సాక్షి, బెంగళూరు : బహుభాషా నటి సంజనా గల్రాని, ప్రముఖ నిర్మాత వందన జైన్‌ల మధ్య క్రిస్మస్‌ ముందు రోజు జరిగిన గొడవ  తారాస్థాయికి చేరింది. ఇద్దరు పరస్పర ఆరోపణలతో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసి బెదిరించుకునే స్థాయి వరకు వెళ్లింది. ప్రస్తుతం వీరి రచ్చ శాండిల్‌వుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళితే... క్రిస్మస్‌ పండగకు ముందు రోజు నగరంలోని ప్రముఖ పబ్‌లో జరిగిన ఓ పార్టీ లో  సంజన, నిర్మాత వందన జైన్‌లు పాల్గొన్నారు. మద్యం మత్తులో ఇద్దరు పరస్పరం గొడవపడినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇద్దరు పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు. 

సంజనా ఏకంగా బెంగళూరు నగర పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. శనివారం సంజన మీడియాతో  మాట్లాడుతూ...వందనకు రూ. 200 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని డిమాండ్‌ చేశారు. అక్రమ దందాలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. రాజకీయ నాయకులు, క్రికెటర్ల నుంచి వందన జైన్‌ అక్రమ దందాలు చేసినట్లు ఆరోపించారు. 

ఇదే విషయంపై నిర్మాత వందన జైన్‌ మాట్లాడుతూ... తనను ప్రశ్నించటానికి సంజన ఎవరిని, తాగిన మైకంలో తనపై దాడి చేయడంతో పాటు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సంజన విషయాలు తనకు అన్నీ తెలుసని, అవి బయటపెడితే రోడ్డున పడుతుందని వందన అన్నారు. సంజన మద్యం బాటిల్‌తో తనపై దాడి చేసిన దృశ్యాన్ని అందరూ చూశారని, తనను సంజన హత్య చేస్తానని బెదిరిస్తున్నారని అన్నారు. తనకు బెంగళూరులో స్నేహితులు ఉన్నారని, నగరానికి వచ్చిన ప్రతిసారి వారిని కలుస్తానని, క్రిస్మస్‌ ముందురోజు స్నేహితులతో ఉండగా సంజన తనపై మద్యం బాటిల్‌తో దాడి చేసిందని వందన ఆరోపించారు.    

నటి సంజనపై ఫిర్యాదు
నటి సంజనా తనపై దాడి చేశారని బాలీవుడ్‌ నిర్మాత వందనా జైన్‌ కబ్బన్‌ పార్క్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 24న బెంగళూరులోని ఒక పబ్‌లో సంజన తనపై దాడి చేసినట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఫిర్యాదుపై సంజన వివరణ ఇచ్చారు. తాను ఎవరిపైనా దాడి చేయలేని స్పష్టం చేశారు. అక్కడ ఎలాంటి గొడవ జరగలేదని, కేవలం తన స్నేహితులతో వాగ్వాదం జరిగిందన్నారు.

మరిన్ని వార్తలు