కోర్టులో స్పృహ తప్పి పడిపోయిన నటి సరిత

6 Mar, 2015 08:59 IST|Sakshi
కోర్టులో స్పృహ తప్పి పడిపోయిన నటి సరిత

చెన్నై: సీనియర్ నటి సరిత కోర్టులో స్పృహ తప్పి పడిపోయారు. దీంతో అక్కడ కాసేపు కలకలం వాతావరణం నెలకొంది. తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో నాయకిగా నటించి పేరు గాంచిన సరిత.. మలయాళ నటుడు ముఖేష్‌ను ప్రేమించి పెళ్లాడింది. వీరికి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. అలాంటిది కొంత కాలం తరువాత సరిత, ముఖేష్ మధ్య అభిప్రాయబేధాలు తలెత్తాయి. ఫలితం విడాకులకు దారి తీసింది. 2009లో ముఖేష్ సరిత నుంచి వివాహ రద్దు కోరుతూ చెన్నై కుటుంబ సంక్షేమ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. సుదీర్ఘ కాలం సాగిన ఈ కేసు విచారణ రెండేళ్ల క్రితం ముఖేష్, సరితకు విడాకులు మంజూరు చేస్తూ తీర్పు నిచ్చింది.

దీంతో ముఖేష్.. మిధుల అనే ఆమెను రెండో వివాహం చేసుకున్నారు. అయితే వీరి వివాహం చెల్లదంటూ నటి సరిత కేరళ, కొచ్చిలోని కుటుంబ సంక్షేమ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అందులో ఆమె పేర్కొంటూ చెన్నై కోర్టులో ముఖేష్ వివాహ రద్దు కోరుతూ వేసిన పిటీషన్‌పై విచారణ జరిగే సమయంలో తాను దుబాయిలో ఉన్నానన్నారు. దీంతో కోర్టు జారీ చేసిన నోటీసులను తాను అందుకోలేకపోయానని వివరించారు. తాను కోర్టుకు హాజరు కాకపోవడంతో కోర్టు విడాకులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.

అందువలన ముఖేష్ రెండో వివాహం చెల్లదని తీర్పు ఇవ్వవలసిందిగా కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసు విచారణ సందర్భంగా సరిత, ముఖేష్‌లిద్దరూ గురువారం కొచ్చి కుటుంబ సంక్షేమ కోర్టుకు హాజరయ్యారు. విచారణానంతరం కోర్టు బోనులోంచి వెనుదిరిగిన సరిత అనూహ్యంగా స్పృహ తప్పి కింద పడిపోయారు. దీంతో కోర్టు ఆవరణలో కాసేపు కలకలం చెలరేగింది. వెంటనే సరిత సన్నిహితులు ఆమెకు సపర్యలు చేసి స్పృహ తెప్పించి ఇంటికి తీసుకెళ్లారు.