లాక్‌డౌన్‌లో నటి జాలీ రైడ్‌, గాయాలు

5 Apr, 2020 10:45 IST|Sakshi

అండర్‌పాస్‌ పిల్లర్‌ను ఢీకొన్న కారు  

నటి షర్మిల సహా ఆమె స్నేహితుడికి గాయాలు 

సాక్షి, బెంగళూరు: కరోనా వైరస్‌తో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలులో ఉన్న సమయంలో కన్నడ నటి తన స్నేహితుడితో ఖరీదైన కారులో జాలీరైడ్‌కు వెళ్లి ప్రమాదానికి గురైంది. కారు వంతెన పిల్లర్‌కు ఢీకొంది. లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తూ నటి షర్మిలా మాండ్రే  ఆమె స్నేహితుడి లోకేష్ వసంత్‌తో కలిసి శనివారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో తన జాగ్వర్‌ కారులో జాలీ రైడ్‌కు బయలుదేరారు. వసంతనగర్‌లో కారును అతి వేగంతో నడపడంతో అదుపుతప్పి అండర్‌పాస్‌ పిల్లర్‌ను ఢీకొన్నారు. దీంతో షర్మిల ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమె స్నేహితుడికి కాలు విరిగింది. ప్రమాదం నుంచి బయటపడి తేలికపాటి గాయాలతో బయటపడ్డారు. దీంతో పోర్టిస్ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించుకుని వెళ్లిపోయారు. (ఫోన్ సిగ్నల్స్ ద్వారా రోనా?)

కాగా  లాక్‌డౌన్‌ సమయంలో బాధ్యతను విస్మరించిన షర్మిల చర్యలను పలువురు తీవ్రంగా ఖండిస్తున్నారు. ‘సీట్‌ బెల్ట్‌ వేసుకోని కారణంగా ఎయిర్‌ బ్యాగ్‌ తెరుచుకోలేదు. లాక్‌డౌన్‌ నియమాలను ఉల్లంఘించి ఇంటి నుండి బయట రావటమే తప్పు. ఆస్పత్రి నుండి పరారీ కావటం మరో తప్పు’ అని విమర్శిస్తున్నారు. కాగా షర్మిల, ఆమె స్నేహితుడు తాగి డ్రైవింగ్‌ చేశారా లేక వేగంగా వెళ్లి ఢీకొన్నారా?.  ప్రమాద సమయంలో ఎవరు డ్రైవింగ్‌ చేశారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. హైగ్రౌండ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు పరారీలో ఉన్న వీరి కోసం గాలిస్తున్నారు. మరోవైపు షర్మిలపై జాతీయ విపత్తు నిర్వహణ చట్టం కింద కూడా ఫిర్యాదు చేయనున్నట్లు ట్రాఫిక్ పోలీసు జాయింట్ పోలీస్ కమిషనర్ రవికాంతెగౌడ తెలిపారు. (జనం చస్తుంటే వంటావార్పులేంటి: సానియా)

మరిన్ని వార్తలు