శ్రేయారెడ్డి రీ ఎంట్రీ

15 Sep, 2014 00:52 IST|Sakshi
శ్రేయారెడ్డి రీ ఎంట్రీ

 నటి శ్రేయా రెడ్డి గుర్తున్నారా? ఆ మధ్య తిమిరు (తెలుగులో పొగరు) చిత్రంలో ప్రతినాయకిగా దుమ్మురేపిన నటి ఈమె. అంతకు ముందు తమిళంలో హీరోయిన్‌గానూ అంతకంటే ముందు తెలుగులోనూ నటించిన శ్రేయా రెడ్డి నటుడు విశాల్ అన్నయ్య విక్రమ్‌ను పెళ్లి చేసుకుని నటనకు దూరం అయ్యారు. కొంత కాలం అమెరికాలో ఉన్న శ్రేయా రెడ్డి ఇటీవలే చెన్నైకి తిరిగొచ్చారు. ఈమె మళ్లీ నటనపై దృష్టిసారించడం విశేషం. ఆండవ కానూన్ అనే చిత్రంలో శ్రేయా రెడ్డి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. దర్శకుడు సుశీంద్రన్ శిష్యుడు వడివేల్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది.
 
 ఈ సందర్భంగా తన రీఎంట్రీ గురించి శ్రేయారెడ్డి తెలుపుతూ ఆండవ కనూన్ (దేవుని చట్టం) చిత్రంలో నటిద్దామా? వద్దా? అన్న శంకతోనే అంగీకరించానన్నారు. ఎందుచేతనంటే ఆ పాత్ర అంత క్రిటికల్‌గా ఉంటుందన్నారు. తేని నేపథ్యంలో సాగే గ్రామీణ కథా చిత్రం అని తెలిపారు. అయితే చిత్ర కథ విన్న విశాల్, విక్రమ్‌తో పాటు పలువురు తనను నటించమని ప్రోత్సహించారని అన్నారు. ఇందులో తన పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందన్నారు. దర్శకుడు వడివేల్‌కు కథపై చాలా పట్టు ఉందని ఆయన చిత్రీకరణ విధానం చూస్తుంటే అర్ధం అయ్యిందని అన్నారు. చిత్రంలో నూతన జంట హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారని వారికి గత 90 రోజులుగా నటనలో శిక్షణ ఇస్తున్నారని చెప్పారు.