శ్రీదేవికి కోపమొచ్చింది...

11 Sep, 2015 09:10 IST|Sakshi
శ్రీదేవికి కోపమొచ్చింది...

అతిలోక సుందరి శ్రీదేవికి కోపమొచ్చింది. 'పులి' చిత్రంలో తన పాత్ర నిడివిని తగ్గించటంపై ఆమె ఆగ్రహంగా ఉందట. వివరాల్లోకి వెళితే...ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షిస్తున్న సినిమా 'పులి'. బాహుబలి తరువాత అదే స్థాయి బడ్జెట్ తో పాటు అదే స్ధాయి సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. కోలీవుడ్ హీరో ఇళయ దళపతి విజయ్  నటిస్తున్న ఈ సినిమాకు చింబుదేవన్ దర్శకుడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.  పులి సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. విజ‌య్ స‌ర‌స‌న శృతిహాస‌న్, హ‌న్సిక‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇక పులి సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ అతిలోక సుందరి శ్రీదేవి. చాలా సంవత్సరాల తరువాత ఈ బ్యూటీ ఓ సౌత్ సినిమాలో నటిస్తుండటం సినిమా ప్రమోషన్ విషయంలో కూడా చాలా హెల్ప్ అయ్యింది. అయితే శ్రీదేవి పేరును ఇంత భారీగా వాడుకున్న చిత్ర యూనిట్ ...సినిమాలో మాత్రం ఆమె పాత్రను కొద్ది నిమిషాలకే పరిమితం చేశారట. దీంతో చిత్రయూనిట్పై శ్రీదేవి ఫైర్ అయినట్లు సమాచారం.

చాలా రోజులుపాటు శ్రీదేవి కాల్షీట్లు తీసుకున్న దర్శకుడు చింబుదేవన్ ఆమెపై చాలా సీన్లను షూట్ చేశాడు. సినిమా నిడివి పరంగా కొన్నిసీన్స్ కట్ చేయాల్సి రావడంతో శ్రీదేవి నటించిన చాలా సన్నివేశాలపై కోత పడింది. డబ్బింగ్ సమయంలో ఈ విషయాన్ని గుర్తించిన శ్రీదేవి పులి యూనిట్ పై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కాగా తెలుగు వెర్షన్ కోసం డబ్బింగ్ చెప్పేందుకు ఆమె ఏకంగా కోటి రూపాయిలు డిమాండ్ చేసిందట.