కెరీర్ ఆరంభం నుంచి అందాలు ఆరబోస్తూనే ఉన్నానని అంటోంది నటి సునైనా. పదహారణాల తెలుగమ్మాయి నటిగా తమిళ చిత్రపరిశ్రమ(కోలీవుడ్)లో మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఆశించిన స్థానం కోసం ఇంకా పోరాడుతూనే ఉంది. ఆ మధ్య నటించిన నీర్పరవై చిత్రంలో మంచి పేరు సంపాదించుకుంది. అయితే అవకాశాలు అరకొరగానే అందుకుంటున్న ఈ బ్యూటీతో చిన్న భేటీ..
ప్ర : నీర్పరవై చిత్రంలో ఎస్తెర్గా నటించిన అనుభవం ?
జ : వంశం చిత్రం తరువాత అంతగా పేరు తెచ్చిపెట్టిన చిత్రం నీర్పరవై. ఈ చిత్రంలో ఎస్తెర్ పాత్ర కోసం నన్ను సముద్రతీర యువతిగా మార్చేశారు దర్శకుడు. అందుకే ఆ పాత్రకు అంతగా గుర్తింపు లభించింది. ఆ తరహా పాత్రలు మరిన్ని పోషించాలనే ఆసక్తి ఉంది.
ప్ర : మధ్యలో సడన్గా కనిపించకుండా పోతున్నారే?
జ : అందుకు కారణం నేను తమిళ చిత్రాలతో పాటు తెలుగులో రెండుచిత్రాలలోను నటించడమే. అదేవిధంగా నేను నటించిన తమిళ చిత్రాలు ఆశించిన విజ యాలను సాధించకపోవడంతో ఇక్కడ పూర్తిగా దృష్టి పెట్టలేకపోతున్నాను.
ప్ర : ఇంతకు ముందు ఈత దుస్తుల్లో కూడా నటించిన మీరు ఇప్పుడు గ్లామరస్ పాత్రలను నిరాకరిస్తున్నారట?
జ : ఈ ప్రచారంలో నిజం లేదు. మీరు చెప్పినట్లే నేను ఆరంభం నుంచి అందాలారబోస్తూనే ఉన్నాను. కాదళి ల్ విళుందేన్, మాసిలామణి, మొదలగు చిత్రాలలో హీరోయిన్గా మంచి గుర్తింపు పొందాను. అయితే మైక్ సెట్ పాండి చిత్రంలో బికినీ ధరించి నటించినా ఆ చిత్రం సక్సెస్ కాలేదు. అలాగని నేనెప్పుడూ గ్లామర్ పాత్రలకు వ్యతిరేకత చెప్పలేదు. అలాంటి ఆలోచన లేదు.
ప్ర : సమర్లో చిన్న పాత్రను అంగీకరించారే?
జ : ఆ చిత్రంలో విశాల్ ప్రేయసి పాత్ర కావడంతో అంగీకరించాను. అయితే నేను నటించిన కొన్ని సన్నివేశాలు మాత్రమే సమర్ చిత్రంలో ఉన్నాయి. అయినా ఆ చిత్రంలో విశాల్లో జతకట్టడం సంతోషకరమైన విషయం.
ప్ర : నంబియార్ చిత్రంలో నటి సరోజా దేవిగా నటిస్తున్నారట?
జ : అవును. అభినయ సరస్వతిగా పేరుగాంచిన నటి సరోజా దేవి. ఆమె పాత్రలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ చిత్రంలో నటించే అవకాశం రావడం ఆనందంగా ఉంది.