నటి సునైనాకు పెళ్లైందా? 

30 Dec, 2019 09:33 IST|Sakshi

చెన్నై: నటి సునైనాకు పెళ్లైందా? ఇప్పుడు ఇండస్ట్రీలో జరుగుతున్న ఆసక్తికరమైన టాక్‌ ఇదే. కాదలిల్‌ విళిందేన్‌ (ప్రేమలో పడ్డాను) అనే చిత్రం ద్వారా కోలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమైన నటి సునైనా. తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్న ఈ భామ ఆ తరువాత వరుసగా మాసిలామణి, యాదుమాగి, నీర్‌పార్వై, వంశం చిత్రాల్లో నటించింది. అయినా ఎందుకనో స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకోలేకపోయింది. అయితే నటిగా మంచి పేరు తెచ్చుకుంది. ఇటీవల ధనుష్‌ హీరోగా నటించిన ఎన్నై నోక్కి పాయుమ్‌ తూటా చిత్రంలో కూడా ముఖ్య పాత్రలో నటించింది. 

కాగా తాజాగా నటించిన సిల్లుక్కరుపట్టి చిత్రంలో సునైనా నటనకు ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇదంతా బాగానే ఉన్నా, ఇటీవల ఒక యువకుడితో ఉన్న ఫొటోను నటి సునైనా తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేసింది. అంతే అప్పటి నుంచి సునైనాకు పెళ్లైపోయ్యిందని, తన రహస్యంగా వివాహం చేసుకుందని ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఇది సునైనాకు తలనొప్పిగా మారిందట. ఈ ప్రచారంతో చాలా మంది ఆమెకు ఫోన్‌ చేసి రకరకాలుగా ప్రశ్నిస్తున్నారట. మరి కొందరైతే శుభాకాంక్షలు చెప్పేస్తున్నారట. దీంతో ఈ అమ్మడికి నోరు విప్పక తప్పలేదు. ఈ వ్యవహారంపై నటి సునైనా స్పందిస్తూ తనకు పెళ్లైపోయిందన్న ప్రచారంలో వాస్తవం లేదని, అదంతా వదంతి అని చెప్పింది. 

ఇలా ఎవరు అసత్య ప్రచారం చేస్తున్నారో తెలియదు గానీ, చాలా మంది తనకు ఫోన్‌ చేసి విచారిస్తున్నారని అంది. అయినా తన వివాహాన్ని రహస్యంగా జరుపుకోవలసిన అవసరం లేదని, వరుడెవరన్నది నిర్ణయం అయిన తరువాత ఆ విషయాన్ని తానే బహిరంగంగా వెల్లడిస్తానని, పెళ్లిను కూడా అందరి సమక్షంలోనే చేసుకుంటానని చెప్పింది. కాగా తొలుత తెలుగులోనే హీరోయిన్‌గా పరిచయమైన ఈ భామ నటిగా దశాబ్దన్నర పూర్తి చేసుకుంది. అదే విధంగా తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం అంటూ దక్షిణాది భాషలన్నింటిలోనూ నటించిన సునైనా ప్రస్తుతం తమిళంలో ట్రిప్, ఎరియుమ్‌ కన్నాడి చిత్రాల్లో నటిస్తోంది. అన్నట్లు వెబ్‌ రంగంలోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఇప్పటికే మూడు వెబ్‌ సిరీస్‌లో నటిస్తూ బిజీగా ఉంది. 

మరిన్ని వార్తలు