త్రిష ఎంగేజ్మెంట్ అయిపోయిందా?

19 Nov, 2014 11:56 IST|Sakshi
త్రిష ఎంగేజ్మెంట్ అయిపోయిందా?

నటి త్రిషకు పెళ్లి కుదిరింది. నిశ్చితార్థం కూడా జరిగింది. వరుడు ప్రముఖ పారిశ్రామికవేత్త, నిర్మాత వరుణ్ మణియన్. వచ్చే ఏడాది మార్చిలో పెళ్లి. ఇది సోమవారం సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూ చేస్తున్న ప్రచారం. నిజం చెప్పాలంటే గత ఏడాదికి పైగా త్రిష వివాహం గురించి మీడియాలో రకరకాల ప్రచారం కలకలం కొనసాగుతూనే ఉంది. టాలీవుడ్ నటుడు రానాతో ప్రేమ, రహస్య వివాహం జరిగిపోయిందంటూ వదంతులు జోరుగా సాగాయి. అయితే ఇటీవల రానాకు త్రిషకు మధ్య మనస్పర్థలు తలెత్తాయి.  అంతేకాదు ప్రేమ విఫలం అవడంతో నటి త్రిష అసహనంతో ఉన్నారని,  దీంతో అనారోగ్యానికి గురయ్యారంటూ వార్తలు వెలువడ్డాయి.
 
ఇలాంటి రకరకాల ప్రచారం మధ్య సోమవారం త్రిష, వరుణ్ మణియన్‌ల వివాహ నిశ్చితార్థం జరిగిందనే న్యూస్ కోలీవుడ్‌లో మరింత చర్చనీయాంశంగా మారింది. 'లేసా లేసా' చిత్రం ద్వారా హీరోయిన్‌గా రంగ ప్రవేశం చేసిన త్రిష ఆ తరువాత తమిళం, తెలుగు భాషల్లో మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటూ ప్రముఖ కథానాయికి స్థాయికి చేరారు. టాప్ హీరోయిన్ గా దశాబ్ద కాలాన్ని దాటేసిన త్రిషకు పెళ్లి చేయాలనే నిర్ణయానికి ఆమె తల్లి వచ్చారని, వరుడి వేటలో ఉన్నారనే ప్రచారం జరిగింది. అనూహ్యంగా త్రిష వరుణ్ మణియన్ సన్నిహితంగా ఉన్న ఫొటో ఇంటర్‌నెట్‌లో ప్రచారమై కోలీవుడ్‌నే ఆశ్చర్యపరిచింది. వీరి వివాహ నిశ్చితార్థం రెండు రోజుల ముందు జరిగిందని వచ్చే ఏడాది మార్చిలో త్రిష, వరుణ్ మణియన్‌ల వివాహం జరగనుందని ప్రచారం జోరందుకుంది.
 
అదంతా ఉత్తిదే
అయితే ఇదంతా అసత్యప్రచారం అని త్రిష తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అలాంటిదేమైనా జరిగితే ముందుగా మీకే చెబుతానని ఈ బ్యూటీ అభిమానులనుద్దేశించి ట్విట్టర్‌లో పోస్టు చేశారు. అదే విధంగా త్రిష తల్లి ఉమ కూడా నిశ్చితార్థం ప్రచారాన్ని ఖండించారు. త్రిష పెళ్లి ఇంకా నిర్ణయించలేదని స్పష్టం చేశారు. అయితే ఈ ప్రచారం గురించి వరుణ్ మణియన్ గానీ, ఆయన కుటుంబం గానీ ఖండించకపోవడం గమనార్హం.
 
 పెళ్లి నిజమే!
పరిశ్రమలోని ఒక వర్గం టాక్ మరోలా వినిపిస్తోంది. నటి త్రిష వరుణ్ మణియన్‌ల నిశ్చితార్థం జరిగిన మాట వాస్తవమేనని ఈ విషయాన్ని త్రిష, ఆమె తల్లి ఉమ దాచడానికి కారణం ఉందని అంటున్నారు. అదేమిటంటే త్రిష ప్రస్తుతం మూడు నాలుగు చిత్రాల్లో నటిస్తున్నారని పెళ్లి విషయం తెలిస్తే ఆ చిత్రాల వ్యాపారానికి పెద్ద దెబ్బే తగులుతుందని అందువలన ఈ పెళ్లి నిశ్చితార్థం విషయాన్ని మరికొద్ది రోజులు రహస్యంగా ఉంచాలనే భావనలో వున్నట్లు కోడంబాక్కం టాక్.