బేడీలు వేస్తాం!

21 Jul, 2019 00:11 IST|Sakshi

పువ్వులు పట్టుకున్న ముద్దుగుమ్మల చేతులు లాఠీలు పట్టుకున్నాయి. తమ పెర్ఫార్మెన్స్‌తో థియేటర్స్‌లో ప్రేక్షకుల మనసులను లాక్‌ చేయాలని ఈ ముద్దుగుమ్మలు తమలోని అదర్‌ సైడ్‌ని చూపించడానికి రెడీ అయిపోయారు. సీరియస్‌ అండ్‌ సిన్సియర్‌ పోలీసాఫీసర్లుగా కనిపించి, విలన్లను రప్ఫాడించడానికి సిద్ధమైన ఆ హీరోయిన్ల గురించి తెలుసుకుందాం.

‘నిశ్శబ్దం’ చిత్రం కోసం ఆమెరికా పోలీసాఫీసర్‌ అవతారం ఎత్తారు అంజలి. ఈ గెటప్‌లో సెట్‌ కావాలని దాదాపు ఎనిమిది కిలోల బరువు కూడా తగ్గారామె. ఇటీవల ఈ సినిమాలో అంజలి పాత్ర చిత్రీకరణ మొదలైంది. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో నాలుగు భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనుష్క, మాధవన్, షాలినీ పాండే, మైఖేల్‌ మ్యాడ్‌సన్‌ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఇక ‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమాలో గ్లామరస్‌గా రెచ్చిపోయిన పాయల్‌ రాజ్‌పుత్‌ ఇటీవల పోలీసాఫీసర్‌గా చార్జ్‌ తీసుకున్నారు. ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

పాయల్‌ రాజ్‌పుత్‌, రాయ్‌ లక్ష్మి, రేవతి, జ్యోతిక

అటు చెన్నైకి వెళితే హీరోయిన్లు జ్యోతిక అండ్‌ రేవతి ఇద్దరూ కలిసి ఒకే పోలీస్‌స్టేషన్‌లో డ్యూటీ చేస్తున్నారు. వీరిద్దరి డ్యూటీ ‘జాక్‌పాట్‌’ అనే తమిళం సినిమా కోసం. ఈ సినిమాకు కల్యాణ్‌ దర్శకత్వం వహించారు.  తమిళంలో మరో భామ పోలీస్‌గా కనిపించబోతున్నారు. ఆమె ఎవరో కాదు.. నటి, డాటరాఫ్‌ శరత్‌కుమార్‌. ఓ డాగ్‌ని వెంటపెట్టుకుని పోలీసాఫీర్‌గా ఓ కేసును దర్యాప్తు చేస్తున్నారు వరలక్ష్మీ శరత్‌కుమార్‌. ఆమె ఇన్విస్టిగేషన్‌ రిపోర్ట్‌ను ‘డానీ’ సినిమాలో చూడాలి. ఈ కేసును సంతానమూర్తి డైరెక్ట్‌ చేస్తున్నారు.

తెలుగులో పలు చిత్రాల్లో గ్లామరస్‌ హీరోయిన్‌గా కనిపించిన  రాయ్‌ లక్ష్మి ఇప్పుడు కన్నడంలో ఇంటర్‌పోల్‌ ఆఫీసర్‌గా ఓ సీక్రెట్‌ ఆపరేషన్‌ చేస్తున్నారు. ఆమె స్కెచ్‌ హీరో సుదీప్‌ కోసమే. పోలీస్‌గా ఆమె వేసిన మాస్టర్‌ ప్లాన్‌ ఏంటో ‘కోటిగొబ్బ 3’ సినిమాలో తెలుస్తుంది. మొన్నామధ్య ఫైటింగ్, ఫైరింగ్‌ గట్రా నేర్చుకున్నారు హీరోయిన్‌ రాయ్‌లక్ష్మీ. ఇంత కష్టపడింది ఆమె కన్నడ చిత్రం ‘ఝాన్సీ’లో పోలీస్‌ గెటప్‌ వేయడం కోసమే. పీవీఆర్‌ గురుప్రసాద్‌ ఈ చిత్రానికి డైరెక్టర్‌.


సౌత్‌లోనే కాదు.. బాలీవుడ్‌ భామలు కొందరు పోలీస్‌సైరన్‌ మోగిస్తున్నారు. ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సాహో’. ఈ సినిమాతో సౌత్‌కు పరిచయం అవుతున్నారు బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధాకపూర్‌. ఈ సినిమాలో శ్రద్ధాది పోలీస్‌ పాత్రే అని ఆల్రెడీ విడుదలైన ‘సాహో’ టీజర్‌ చెబుతోంది. ‘అంగ్రేజీ మీడియం’ సినిమా కోసం గన్‌ పట్టుకున్నారు కరీనా కపూర్‌. ఈ సినిమాకు హోమి అడ్జానియా దర్శకుడు. ఇర్ఫాన్‌ ఖాన్‌ హీరోగా నటిస్తున్నారు. ముంబైలో జరిగే అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని మళ్లీ శివానీ శివాజీ రాయ్‌గా డ్యూటీ చేస్తున్నారు రాణీ ముఖర్జీ. శివాజీ రాయ్‌ అనగానే ‘మర్దానీ’ చిత్రం గుర్తుకు వచ్చే ఉంటుంది. ప్రస్తుతం తెరకెక్కుతున్న ఈ సినిమా సీక్వెల్‌ ‘మర్దానీ 2’లో రాణీముఖర్జీ నటిస్తున్నారు. ఫస్ట్‌ పార్ట్‌కి కథ అందించిన∙గోపీ పుత్రన్‌ సీక్వెల్‌ను డైరెక్ట్‌ చేస్తున్నారు.


వరలక్ష్మి, రాణీ ముఖర్జీ, కరీనా కపూర్‌

మరిన్ని వార్తలు