చెయ్యేసే బాస్‌కు బడితపూజ

14 Feb, 2018 00:27 IST|Sakshi
ఆడవాళ్లకు మాత్రమే

డబ్బింగ్‌ క్లాసిక్స్‌– 12

ఆడవాళ్లకు మాత్రమే
సీటులో కూర్చుంటే ఏం తెలుస్తుంది? ఆఫీసుకు టైమ్‌కు వస్తుంది టైమ్‌కు వెళుతోంది అని అనిపిస్తుంది. కాని ఒకామె భర్తకు ఉద్యోగం పోయింది. ఇంట్లో ఉంటున్నాడు. ఉద్యోగం పోయినందుకు చిన్నబుచ్చుకుంటూ ఇంట్లో ఉన్నందుకు భార్యకు సాయం చేస్తూ చిన్న పాప ఉంటే ఆ పాపను చూసుకుంటూ ఉన్నాడు. భర్త గురించి ఆమెకు టెన్షన్‌. కాని తయారయ్యి ఆఫీసులో సీటులో కూర్చుని ఉంటే ఆ టెన్షన్‌ కనిపిస్తుందా? ఇంకొక ఆమెకు మొగుడు తాగుబోతు.

దేవుడి హుండీని కూడా లుంగీలో దాచుకెళ్లి చుక్కేసుకొని వచ్చి పెళ్లాంతో వాదులాటకు దిగుతుంటాడు. చిన్న గుడిసె. లేని బతుకు. జీవితం గడవాలంటే పని చేయాలి. తనొచ్చి ఆఫీసులో చీపురు పట్టి ఊడుస్తూ ఉంటే ఆమె టెన్షన్‌ కనిపిస్తుందా? ఇంకొక అమ్మాయికి పెళ్లి కాదు. వీళ్లు యాభై వరకు అనుకొని ఉంటారు. వచ్చినవాడు లక్ష అడుగుతుంటాడు. పైగా ఇరవై తులాల బంగారం పెట్టాలట. బండి ఇవ్వాలట. పెళ్లి ఖర్చులు పెట్టుకోవాలట.

ఆ అమ్మాయికి కోపం. అలాగైతే తాళి నేను కడతాను కట్టించుకోమనండి అంటుంది. అలాంటి అమ్మాయి తన సీటులో తాను కూర్చుని ఉంటే ఆ సమస్య కనిపిస్తుందా? ఆఫీసు టైము టెన్‌ టు ఫైవ్‌. ఆ టైములో వీరు ముగ్గురు ఆఫీసులో అవైలబుల్‌గా ఉంటారు. సీట్లలో కూర్చుని ఉంటారు. వీళ్లకు బాస్‌ తను. అనగా వీళ్లపై సర్వాధికారి తను. వీళ్ల ఒంటి మీద చెయ్యేస్తే ఏమవుతుంది? ఏమవుతుంది... ‘ఆడవాళ్లకు మాత్రమే’ కథ అవుతుంది.
∙∙
గార్మెంట్స్‌ ఫ్యాక్టరీ అది. అందరూ మహిళా ఉద్యోగులే. ఒంటి మీద బట్టలు కుట్టే వీళ్ల వొంటి మీది పవిట పట్టుకుని లాగాలనుకునే మేనేజర్‌ నాజర్‌. కింది ఉద్యోగులు ఏం చేయగలరు? ఏమైనా చేయాలనుకుంటే ఉద్యోగం తీసేయడూ? అదీ అతడి ధైర్యం. నాజర్‌ది గొప్ప పురుష హృదయం. అతడికి పీఏ, కంప్యూటర్‌ డిజైనర్, స్వీపర్‌ అనే తేడా లేదు. అందరూ కావాలి. తను పిలిస్తే అందరూ వస్తారని అభిప్రాయం. ఊర్వశి– అతడి పీఏ.

ఆమెను పిలిచి తన కుర్చీ పక్కన నిలబడేలా చేసి వెనుక నుంచి తడిమేసే ప్రయత్నం చేస్తుంటాడు. రోహిణి– ఆ ఆఫీసు స్వీపర్‌. లోపలికి పిలిచి ‘నువ్వు బాగా చిమ్మాలి’... ‘నువ్వు బాగా పని చేయాలి’... ‘నువ్వు...’ ఈ ‘నువ్వు’ అనేటప్పుడంతా అతడు తన చూపుడు వేలిని ఆమె ఎద మీద గుచ్చుతుంటాడు. ఆమె చీపురు అడ్డం పెట్టుకుంటూ ఉంటుంది. రేవతి– కంప్యూటర్‌ డిజైనర్‌. ఈ అమ్మాయి చదువుకున్న అమ్మాయి కాబట్టి లంచ్‌కు పిలుస్తుంటాడు. ‘ఏదో జోక్‌లో చదివాను.

ఇలాగే ఒక మేనేజర్, అతడి అసిస్టెంట్‌ అమ్మాయి కలిసి భోం చేస్తుంటే ‘నంచుకోవడానికి ఏమైనా ఉందా’ అని మేనేజర్‌ అడుగుతాడు. ‘నంచుకోవడానికి ఏమీ లేదు కాని ఉంచుకోవడానికి నేనున్నాను’ అని ఆ అమ్మాయి అంటుంది’ అని పెద్దగా నవ్వుతాడు. మరి నీ సంగతి ఏమిటి అన్నట్టు చూస్తాడు. దారిన పోయే వెధవ ఒక మాట అనేసి పోతాడు. బస్సులో రాసుకుని వెళ్లే వెధవ బస్సు ఆగగానే దిగి వెళ్లిపోతాడు. ఇది అలా కాదు. ఈ బాస్‌ రోజూ ఉంటాడు. రోజూ వేధిస్తుంటాడు. తందామంటే తన్నలేరు. మాట విందామంటే వినలేరు. నరకం.
∙∙
ఆఫీసులో ఏదో పొరపాటు జరుగుతుంది. ముగ్గురి మీద పోలీసు కంప్లయింట్‌ పెడతాను అని బెదిరిస్తాడు నాజర్‌. అలా వద్దనుకుంటే నాతో మూడు రోజులు గెస్ట్‌హౌస్‌లో గడపాలి అని కోరతాడు. ముందు నుయ్యి. వెనుక గొయ్యి. సరే అని ఒప్పుకుని గెస్ట్‌హౌస్‌కు వెళతారు ముగ్గురు. కాని ఏమయితే అదవుతుందని అతణ్ణి చావబాది కట్టేస్తారు. ఆ తర్వాత పెద్ద ఇంజనీరింగ్‌ చేసి అతణ్ణి దూలానికి వేళ్లాడ గట్టి బాత్‌రూమ్‌కు వెళ్లగలిగేలా భోజనం చేసేలా ఏర్పాట్లు చేసి బంధిస్తారు. మమ్మల్ని హింసించినందుకు ఇది నీకు శిక్ష అని చెబుతారు.

అంతే కాదు అతడి చేత సంతకం పెట్టించి ఆఫీసు ఇన్‌చార్జ్‌షిప్‌ తీసుకుంటారు. అప్పటి దాకా మగవాడి దృష్టికోణం నుంచి ఆఫీసు నడుస్తుంది. ఇప్పుడు స్త్రీల దృష్టి కోణంలో. ఆఫీసును మంచి ఈస్తటిక్‌ సెన్స్‌తో డెకరెట్‌ చేస్తారు. ఆడవాళ్లకు ఇబ్బంది కలిగించే విషయాలను తొలగిస్తారు. తల్లులైన ఉద్యోగుల కోసం ఆఫీసులోనే క్రష్‌ పెడతారు. ఆఫీసు ఎంతో బాగుపడుతుంది. కాని నాజర్‌ బుద్ధి మాత్రం మారదు. అతడు స్త్రీలను వేధించడానికే ప్రయత్నిస్తుంటాడు. చివరకు హెడ్డాఫీసు వారికి అతడి వ్యవహారం తెలుస్తుంది. అండమాన్‌ బ్రాంచ్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేయడంతో కథ సుఖాంతం అవుతుంది. సినిమా ముగుస్తుంది.
∙∙
పని చేసే ఆడవాళ్లు పని చేయడానికి మాత్రమే వస్తారు. వ్యక్తిగత జీవితంలో వారికి ఉండే వొత్తిళ్లు వారికి ఉంటాయి. వారి సంపాదన కుటుంబానికి ముఖ్యం కావచ్చు. అలాగే చేసే పనిలో కూడా వొత్తిళ్లు, సవాళ్లు ఉంటాయి. ఇన్ని ఉండగా వాళ్లు స్త్రీలైన పాపానికి హరాస్‌మెంట్‌కు దిగితే ఎంత అవస్థగా ఉంటుంది. కక్కలేక మింగలేక వాళ్లు పడే అవస్థ అవసరమా? ‘నవమాసాలు మోసి కనేది తల్లి. కాని ఇంటి పేరు మాత్రం తండ్రిది’ అనే డైలాగ్‌ ఉంటుంది ఈ సినిమాలో. ‘పేరుకు లేడీస్‌ స్పెషల్‌ బస్సు. కాని నడిపేది మాత్రం మగవాడు.

అందుకే ఆడవాళ్లను చూసినా ఆపడు’ అనే డైలాగ్‌ కూడా ఉంది. వేధింపులకు మూలమైన బేస్‌ వేల ఏళ్ల నుంచి మగాడు సిద్ధం చేసి ఉన్నాడు. కాని ఆడవాళ్లు తమకు తాముగా నిర్ణయాత్మక స్థానాల్లోకి వచ్చినప్పుడు ఈ పరిస్థితులను మార్చుకుంటారు అని ఈ సినిమా చెబుతుంది. మనసులో దురుద్దేశం పెట్టుకుని ‘సునందా... ఒకసారి కేబిన్‌లోకి రా’ అని పిలిచే బాసులారా.. జాగ్రత్త. మిమ్మల్ని తలకిందులు చేసే శక్తి వారికి ఉంది. బీ గుడ్‌. డూ గుడ్‌.

మగళిర్‌ మట్టుమ్‌
సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో కమలహాసన్‌ నిర్మాతగా 1994లో విడుదలైన సినిమా ‘మగళిర్‌ మట్టుమ్‌’. తెలుగులో మురళీమోహన్‌ డబ్‌ చేయగా ‘ఆడవాళ్లకు మాత్రమే’గా విడుదలైంది. వర్కింగ్‌ విమెన్‌ ఎదుర్కొనే సెక్సువల్‌ హరాస్‌మెంట్‌ మీద పూర్తి కమర్షియల్‌ ఫార్మెట్‌లో వచ్చిన తొలి సినిమా ఇదే కావచ్చు. దీనికి మూలం హాలీవుడ్‌లో సూపర్‌ హిట్టయిన ‘9 టు 5’ (1980). 10 మిలియన్లతో తీసిన ఆ సినిమా ఆ రోజుల్లోనే వంద మిలియన్లు సంపాదించింది. బహుశా అమెరికాలో ఆ సమయంలో పని చేసే ఆడవాళ్లు ఎక్కువ కావడం వర్క్‌ప్లేస్‌ హరాస్‌మెంట్‌ ఎక్కువ ఉండటం కారణం కావచ్చు. తమిళంలో మంచి విజయమే సాధించిన ఆడవాళ్లకు మాత్రమే తెలుగులో పూర్తిగా సఫలం కాలేదు.

దానికి కారణం అప్పటికి నాజర్‌ ఇంకా పూర్తిగా తెలుగువారికి తెలియకపోవడమే. అయినా ఈ సినిమా సున్నితమైన హాస్యంతో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా రేవతి, రోహిణి, ఊర్వశి గొప్ప నటనతో ఆకట్టుకుంటారు. డీగ్లామరస్‌గా కనిపించే రోహిణి అచ్చు ఒక పనిమనిషిలానే ఉంటుంది. ఇందులో ‘శవం’ పాత్ర నగేశ్‌ పోషించాడు. క్లయిమాక్స్‌లో కమలహాసన్‌ కాసేపు కనపడతాడు. హిందీలో ఈ సినిమాను రణధీర్‌ కపూర్‌తో తీశారు. కాని ఏ కారణం చేతనో సినిమా విడుదల కాలేదు. అయితే ‘మగళిర్‌ మట్టుమ్‌’ కంటే ఏడాది ముందు ‘9 టు 5’ స్ఫూర్తితోనే జంధ్యాల ‘లేడీస్‌ స్పెషల్‌’ తీశారు. కాని ఫ్లాప్‌ అయ్యింది.

 సింగీతం శ్రీనివాసరావు

– కె

మరిన్ని వార్తలు