ఊహకందని కోణాలు...

2 Jun, 2014 02:36 IST|Sakshi
ఊహకందని కోణాలు...

అరవింద్ కృష్ణ, మీనాక్షి దీక్షిత్, పూజా రామచంద్రన్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘అడవి కాచిన వెన్నెల’. అక్కి విశ్వనాథరెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్బంగా ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశ్వనాథ్‌రెడ్డి మాట్లాడుతూ-‘‘భిన్నమైన కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించాం. ఊహకందని కోణాలు ఈ కథలో ఉంటాయి. సిరివెన్నెల సాహిత్యం ఈ చిత్రానికి ప్రధాన బలం. ఆర్.కార్తీక్, జోస్యభట్ల కలిసి స్వరాలందించిన ఈ చిత్రం పాటలను ఇటీవలే విడుదల చేశాం.
 
  మంచి స్పందన లభిస్తోంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘ఇందులో శక్తిమంతమైన పాత్ర చేశాను. ఆర్టిస్టులు ఎలివేట్ అవ్వాలంటే మంచి నేపథ్య సంగీతం ముఖ్యం. ఇందులో అద్భుతమైన రీ-రికార్డింగ్ కుదిరింది. దర్శకుడు అన్ని శాఖల నుంచి మంచి అవుట్‌పుట్‌ని రాబట్టుకున్నారు’’ అని అరవింద్ కృష్ణ చెప్పారు. ఆడియోకి మంచి స్పందన రావడం ఆనందంగా ఉందని సంగీత దర్శకులు చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో కోటేశ్వరరావు, కళ్లు కృష్ణారావు తదితరులు కూడా మాట్లాడారు.