అందుకే దీపావళికి వస్తున్నాం

4 Nov, 2018 06:24 IST|Sakshi
బంటితో రవిబాబు

‘‘అదుగో’ సినిమాకి సహకరించిన అందరికీ థ్యాంక్స్‌. ఈ సినిమాతోనే చాలా మంది కెరీర్లు మొదలవబోతున్నాయి. వారికి ఆల్‌ ది బెస్ట్‌. మా సినిమాని దీపావళి రోజు విడుదల చేయడానికి కారణం ఉంది. ఆరోజైతే సినిమా తప్పకుండా చూస్తారని వస్తున్నాం’’ అన్నారు నిర్మాత సురేశ్‌ బాబు. పంది పిల్ల(బంటి) ప్రధాన పాత్రలో, అభిషేక్, నభ నటేష్‌ కీలక పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘అదుగో’. సురేశ్‌ బాబు సమర్పణలో ఫ్లైయింగ్‌ ఫ్రాగ్స్‌ బ్యానర్‌లో రవిబాబు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా ఈనెల 7న విడుదలవుతోంది. ఇండియన్‌ సినిమా చరిత్రలోనే తొలిసారి పూర్తిస్థాయి లైవ్‌ యాక్షన్‌ 3డి యానిమేషన్‌లో ఈ సినిమాని చూపిస్తుండటం విశేషం.

ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా సినిమాలో నటించిన పందిపిల్లతో చిత్ర యూనిట్‌ అంతా కేబీఆర్‌ పార్క్‌ నుంచి ఫిల్మ్‌ ఛాంబర్‌ వరకు పాదయాత్ర చేశారు. రవి బాబు మాట్లాడుతూ– ‘‘ఏ సినిమాకైనా ప్రీ రిలీజ్‌ ఈవెంట్, ఆడియో ఫంక్షన్‌ ఉంటుంది. మా సినిమాకి అవన్నీ చేయడానికి పెద్ద స్టార్స్‌ లేరు. ప్రమోషనల్‌ బడ్జెట్‌ కూడా లేదు. అందుకే ఈ పాదయాత్ర ద్వారా మా సినిమా గురించి అందరికి తెలియజేయాలనుకున్నాం. ఈ సినిమాని తప్పక చూడండి.. కచ్చితంగా ఎంజాయ్‌ చేస్తారు. ఈ దీపావళికి ఎక్కువగా టపాకాయలు పేల్చకండి’’ అన్నారు. ‘‘నటుడిగా నా ఫస్ట్‌ సినిమా ‘నచ్చావులే’. నా 101 వ సినిమా ‘అదుగో’. ‘నచ్చావులే’ సినిమా లాగే ఈ సినిమా పెద్ద హిట్‌ కావాలి’’ అన్నారు నటుడు కాశీ విశ్వనాథ్, హీరో అభిషేక్‌ వర్మ, చిత్ర బృందం పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు