ఒక్క ఫ్లాప్‌తో విలువ తగ్గిపోదు

25 Feb, 2020 00:27 IST|Sakshi
అదితీ రావ్‌ హైదరీ

‘‘ఒక్క అపజయంతో ఏ యాక్టర్‌ విలువ తగ్గిపోదు’’ అంటున్నారు అదితీ రావ్‌ హైదరీ. మణిరత్నం దర్శకత్వంలో చేసిన ‘చెలియా’తో దక్షిణాదిన పాపులర్‌ అయిన అదితీ తెలుగులో ‘సమ్మోహనం’ చిత్రం చేశారు. మూడు నాలుగు రోజులుగా సమంతతో అదితీని ముడిపెట్టి సోషల్‌ మీడియాలో ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది. అదేంటంటే.. ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ అజయ్‌ భూపతి ఓ  సినిమా (‘మహాసముద్రం’ అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది) ప్లాన్‌ చేస్తున్నారు. ఇందులో సమంతను కథానాయికగా తీసుకోవాలనుకున్నారని ప్రచారమైంది.

అయితే ఇటీవల విడుదలైన తమిళ ‘96’ తెలుగు రీమేక్‌ ‘జాను’ ఆశించిన ఫలితం సాధించకపోవడంతో అజయ్‌ భూపతి తన మనసు మార్చుకుని, కథానాయికగా అదితీ రావ్‌ హైదరీని తీసుకోవాలనుకుంటున్నారనే ప్రచారం మొదలైంది. ఈ వార్త గురించి అదితీ తన ట్వీటర్‌ ద్వారా స్పందించారు. ‘‘ఈ విషయం గురించి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉందనిపించింది. అందుకే చెబుతున్నా. ఒక్క ఫ్లాప్‌ వల్ల ఏ యాక్టర్‌ విలువ తగ్గిపోదు. దయచేసి ఇలాంటి ఆలోచనలను మనం ప్రోత్సహించవద్దు. అలాగే సినిమాకి సంబంధించిన ప్రకటనను చేసే అవకాశం  డైరెక్టర్‌ లేదా ప్రొడ్యూసర్‌కి ఇవ్వాలి. వాళ్లను గౌరవించాలి’’ అని పేర్కొన్న అదితీ.. ఈ సినిమా గురించి తనను సంప్రదించారా? లేదా? అనే విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

మరిన్ని వార్తలు