కార్తీ సినిమాలకు పెద్ద అభిమానిని

22 Oct, 2019 02:40 IST|Sakshi
నరేన్, అడివి శేష్, కార్తీ, కె.కె.రాధామోహన్, యస్‌.ఆర్‌. ప్రభు

– అడివి శేష్‌

‘‘కార్తీ ‘ఆవారా’ సినిమాని బ్లాక్‌ టికెట్‌ కొనుక్కొని చూశాను. ‘ఖైదీ’ ట్రైలర్‌ నచ్చి ట్వీట్‌ చేయడం, ఇక్కడికి రావడం జరిగింది. కార్తీ సినిమాలకు నేను పెద్ద ఫ్యాన్‌ని’’ అన్నారు అడివి శేష్‌. కార్తీ హీరోగా లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఖైదీ’. ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు, తిరుప్పూర్‌ వివేక్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ అధినేత కె.కె. రాధామోహన్‌ విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకలో రాధామోహన్‌ మాట్లాడుతూ– ‘‘బెంగాల్‌ టైగర్, పంతం’ లతో నిర్మాతగా మంచి పేరొచ్చింది. ‘ఖైదీ’ సినిమాతో ఇంకా మంచి పేరు రావాలని కోరుకుంటున్నా. ప్రస్తుతం ప్రేక్షకులు మార్పు కోరుకుంటున్నారు.. మాది అలాంటి సినిమానే’’ అన్నారు.

‘‘ఖైదీ’ పేరుతో వచ్చిన అన్ని సినిమాలు హిట్‌ అయ్యాయి. ఈ సినిమా కూడా సూపర్‌ హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నా’’ అన్నారు నిర్మాత బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌. ‘‘సినిమా చాలా బాగా వచ్చింది. తప్పకుండా మీరందరూ ఎంజాయ్‌ చేస్తారు’’ అన్నారు డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ అధినేత ఎస్‌ఆర్‌ ప్రభు. కార్తీ మాట్లాడుతూ – ‘‘నేను కొత్త ప్రయోగాలు చేయడానికి ‘ఖాకీ’ సినిమా చిరునామా అయిపోయింది. ఆ చిత్రం  తర్వాత వస్తోన్న అలాంటి సినిమా ‘ఖైదీ’’ అన్నారు. ‘‘ఇండియాలోనే బిగ్గెస్ట్‌ ఇండస్ట్రీలో ఒక్కటైన తెలుగుకి పరిచయం అవడం సంతోషంగా ఉంది’’ అన్నారు నటుడు నరేన్‌. నిర్మాత ‘ఠాగూర్‌’ మధు, మాటల రచయిత రాకేందు మౌళి తదితరులు పాల్గొన్నారు.
 

>
మరిన్ని వార్తలు