మరో వివాదంలో అద్నాన్ సమీ!

19 Oct, 2013 13:25 IST|Sakshi
మరో వివాదంలో అద్నాన్ సమీ!
వీసా గడువు వివాదం నుంచి బయటపడ్డ పాకిస్థానీ గాయకుడు సంగీత దర్శకుడు అద్నాన్ సమీ మళ్లీ ఇబ్బందుల్లో పడ్డాడు. పన్ను ఎగవేతకు సంబంధించిన వ్యవహారంలో సోమవారం విచారణకు హాజరుకావాలంటూ సర్వీస్ టాక్స్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అద్నాన్ సమీ నిర్వహించిన కార్యక్రమాలపై పన్ను చెల్లించలేదనే కారణంతో ఆయనపై అక్టోబర్ 15 తేదిన కేసు నమోదు చేసామని సర్వీస్ టాక్స్ విభాగం అధికారులు తెలిపారు. 
 
ఎంత మేరకు పన్ను ఎగవేతకు పాల్పడినాడో ఖచ్చితంగా ఇప్పుడే చెప్పలేమని అధికారులు తెలిపారు. సోమవారం సమీని విచారించిన తర్వాతనే ఎంత మొత్తం ఎగవేతకు పాల్పడినాడో చెప్పగలమన్నారు. విచారణకు హాజరయ్యే సమయంలో తాను నిర్వహించిన కార్యక్రమాలకు సంబంధించిన రికార్డులను తీసుకు రావాలని నోటీసులో పేర్కొన్నట్టు అధికారులు తెలిపారు. 
 
వీసా గడువు పూర్తయిన తర్వాత నిబంధనలకు విరుద్ధంగా భారత్ లో అద్నాన్ సమీ ఉండటం గతవారం వివాదంగా మారింది. అయితే తాను చేసిన విజ్క్షప్తికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మూడు నెలలపాటు గడువును పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.