కుదిరితే నాలుగు రోజుల్లో కూడా దర్శకుడు రామ్గోపాల్ వర్మ సినిమా తీయగలరు. ‘దొంగల ముఠా’ను ఐదు రోజుల్లో తీశారు కదా! కథను, అందులో కంటెంట్ను బట్టి షూటింగ్ డేస్ ప్లాన్ చేస్తారాయన. ఇప్పుడు నాగార్జున హీరోగా తీయబోయే సినిమా షూటింగును నాలుగు నెలల్లో కంప్లీట్ చేస్తానని వర్మ పేర్కొన్నారు. తెలుగు చిత్రసీమలో ఓ ట్రెండ్ సెట్టర్గా నిలిచిన ‘శివ’తోనే వర్మ దర్శకుడిగా పరిచయమయ్యారు.
తర్వాత నాగార్జునతో ‘అంతం’, ‘గోవిందా గోవింద’ సినిమాలు తీశారు. మళ్లీ 23 ఏళ్ల తర్వాత ఈ కాంబినేషన్ కుదిరింది. అయితే... ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలు తక్కువని కొన్ని ఊహాగానాలు రావడంతో వర్మ స్పందించారు. ‘‘అక్కినేని నాగార్జున సినిమా షూటింగ్ నవంబర్లో ప్రారంభించి, ఫిబ్రవరిలో ముగిస్తా. ఏప్రిల్లో సినిమా విడుదలవుతుంది. ఏప్రిల్లో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ స్టార్ట్ చేసి, సెప్టెంబర్కి రెడీ చేస్తా’’ అని ఆయన పేర్కొన్నారు.