ఐటీ అధికారుల ముందుకు అర్చన కల్పత్తి

13 Feb, 2020 09:22 IST|Sakshi
అర్చన కల్పత్తి

చెన్నై ,పెరంబూరు: ఆదాయపన్ను శాఖా అధికారుల ముందుకు ఏజీఎస్‌ సంస్థ నిర్వాహకురాలు అర్చన కల్పత్తి బుధవారం హాజరయ్యారు. బిగిల్‌ చిత్ర వసూళ్ల వ్యవహారంలో ఐటీ శాఖకు పన్ను చెల్లించలేని కారణంగా ఆదాయశాఖ అధికారులు ఇటీవల ఈ చిత్ర నిర్మాణ సంస్థ కార్యాలయం, నిర్మాతల ఇళ్లు, నటుడు విజయ్‌కు చెందిన ఇళ్లు, ఫైనాన్సియర్‌ అన్బుచెలియన్, డిస్ట్రిబ్యూటర్‌ సుధాకర్‌ ఇల్లు, కార్యాలయాలపై సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో అన్బుచెలియన్‌ ఇళ్లు, కార్యాలయంలో రూ.77 కోట్లు, రూ. 300 కోట్ల విలువైన పత్రాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ వ్యవహారంలో ఆదాయపన్ను శాఖ కార్యాలయానికి హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా విజయ్, అన్బుచెలియన్, సుధాకర్‌లకు ఐటీ అధికారులు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే.

విజయ్‌ సినామా షూటింగ్‌లో బిజిగా ఉండడంతో ఆయన ఆడిటర్‌ మంగళవారం నుంగంబాక్కంలోని ఐటీశాఖ కార్యాలయానికి వెళ్లి అధికారులకు వివరణ ఇచ్చారు. కాగా బుధవారం ఏజీఎస్‌ సంస్థ నిర్వాహకురాలు, ఆ సంస్థ అధినేత అఘోరం కల్పత్తి కూతురు అర్చన ఆదాయపన్ను శాఖ అధికారుల ముందు హాజరయ్యారు. అప్పుడు అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె బదులిచ్చినట్లు తెలిసింది. కాగా డిస్ట్రిబ్యూటర్‌ సుధాకర్‌ తరపున ఆయనకు సంబంధించిన వ్యక్తి హాజరయ్యారు. ఫైనాన్సియర్‌ అన్బుచెలియన్‌ మాత్రం ఇంకా ఐటీ అధికారుల ముందుకు హాజరు కాలేదు. దీంతో ఆయనకు మరోసారి సమన్లు జారీ చేసినట్లు సమాచారం. దీంతో అన్బుచెలియన్‌ లేదా ఆయన తరపు వ్యక్తి గురువారం ఐటీ అధికారుల ఎదుట హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. (చదవండి: విజయ్‌కి ఐటీ శాఖ సమన్లు)

మరిన్ని వార్తలు