అహం బ్రహ్మాస్మి అదిరిపోతుంది

7 Mar, 2020 03:24 IST|Sakshi

– మంచు మనోజ్‌

మూడేళ్ల విరామం తర్వాత మంచు మనోజ్‌ హీరోగా రూపొందుతున్న ‘అహం బ్రహ్మాస్మి’ చిత్రానికి శుక్రవారం కొబ్బరికాయ కొట్టారు. ఈ చిత్రంతో శ్రీకాంత్‌ ఎన్‌. రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రియాభవానీ శంకర్‌ కథానాయిక. విద్యా నిర్వాణ, మంచు ఆనంద్‌ సమర్పణలో ఎంఎం ఆర్ట్స్‌ బ్యానర్‌పై మనోజ్‌ కుమార్‌ మంచు, నిర్మలాదేవి మంచు నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల అనంతరం మనోజ్‌పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి హీరో రామ్‌చరణ్‌ క్లాప్‌ ఇచ్చారు.

మంచు లక్ష్మి, చిరంజీవి కుమార్తె సుస్మిత కెమెరా స్విచ్చాన్‌  చేశారు. లక్ష్మి కుమార్తె బేబీ విద్యా నిర్వాణ మంచు తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించింది. నటుడు మోహన్‌బాబు, రచయిత పరుచూరి గోపాలకృష్ణలు దర్శకుడికి స్క్రిప్ట్‌ అందజేశారు. ఈ సందర్భంగా మంచు మనోజ్‌ మాట్లాడుతూ– ‘‘శ్రీకాంత్‌ రెడ్డి చెప్పిన కథ బాగా నచ్చడంతో మూడేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. యంగ్‌ టీమ్‌తో పనిచేస్తున్న ఈ సినిమా అదిరిపోతుంది. ఈ చిత్రంతో ప్రేక్షకుల్ని, మా అభిమానుల్ని అలరిస్తానని ఆశిస్తున్నా’’ అన్నారు. శ్రీకాంత్‌ ఎన్‌. రెడ్డి మాట్లాడుతూ – ‘‘తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్‌ ఇండియా మూవీగా రూపొందిస్తున్న చిత్రమిది.

ఈ నెల 11నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలవుతుంది. మే నెలలో పీటర్‌ హెయిన్స్‌ సారథ్యంలో హైదరాబాద్‌లో యాక్షన్‌ సన్నివేశాల్ని చిత్రీకరిస్తాం. జూన్‌లోగా సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో పాటలు, నేపథ్య సంగీతం కొత్తగా ఉంటాయి. అనంత శ్రీరామ్, రామజోగయ్యశాస్త్రి చక్కని పాటలు రాశారు’’ అన్నారు సంగీత దర్శకుడు అచ్చు రాజమణి. ‘‘ఈ చిత్రంలో ఒక పాటకు సంగీతాన్ని అందిస్తున్నా’’ అన్నారు రమేష్‌ తమిళమణి. ‘‘మంచి సినిమాలో నన్ను భాగం చేసిన మోహన్‌ బాబుగారికి, మనోజ్, శ్రీకాంత్‌గార్లకు ధన్యవాదాలు’’ అన్నారు ప్రియాభవానీ శంకర్‌. ఈ చిత్రానికి కెమెరా: సన్నీ కూరపాటి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: వెంకట్‌ చల్లగుళ్ల.

మరిన్ని వార్తలు