ఐష్ మనసు వెన్న

3 Nov, 2013 08:51 IST|Sakshi
ఐష్ మనసు వెన్న

ముంబై: పుట్టినరోజు వచ్చిందంటే చాలు. ఎక్కువశాతం మంది భారీ పార్టీలు ఏర్పాటుచేసి విలాసంగా గడిపేస్తారు. విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసేస్తారు. అయితే అమితాబ్ బచ్చన్ కోడలు, బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ మాత్రం అలా చేయలేదు. క్యాన్సర్ వ్యాధిపీడితులకు విరాళాలు అందజేసి తనలోని మానవతను చాటుకుంది.
 
తన 40 పుట్టినరోజు ఈ సందర్భంగా ఐశ్వర్యరాయ్ మాట్లాడుతూ ‘నాకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. దీపావళి పండుగ సమయంలోనే నా పుట్టినరోజు రావడం యాదృచ్ఛికం. ఇది వేడుకలు జరుపుకునే సమయం. ఈ జీవితాన్ని ప్రసాదించిన నా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. ఈ జీవితంలో నేను ఎన్నో పొందా. ప్రతి ఏడాది ఇదేవిధంగా క్యాన్సర్ వ్యాధిపీడితులకు సహాయమందిస్తున్నా. ఈ ఏడాది కొంత నగదు అందజేశా. ఇకముందు కూడా ఇలాగే చేయాలనుకుంటున్నా. నా తల్లిదండ్రులు నాకు నేర్పింది ఇదే’ అని అంది.
 
కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఈ నెల 1న పుట్టినరోజు జరుపుకుంది ఐశ్వర్యరాయ్. కుమార్తె ఆరాధ్య తనకు పెద్ద వరమని 2007లో సహనటుడు అభిషేక్ బచ్చన్‌ను వివాహమాడిన ఐశ్వర్య ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ‘ఆరాధ్యే నా ప్రపంచం’అని పేర్కొంది.