ఐశ్వర్య రీ ఎంట్రీ

24 Jan, 2014 00:48 IST|Sakshi
ఐశ్వర్య రీ ఎంట్రీ
మణిరత్నం చిత్రం ద్వారా మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ తమిళ తెరపై రీఎంట్రీకి సిద్ధమవుతున్నారు. కోలీవుడ్‌లో ఇరువర్ చిత్రం ద్వారా రంగప్రవేశం చేసిన ఈ బ్యూటీని పరిచయం చేసింది మణిరత్నమే. ఆ తరువాత పలు చిత్రాల్లో నటించిన ఐశ్వర్యా రాయ్ బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్‌ను పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు తల్లి అయ్యారు. దీంతో నటనకు కొంత కాలం గ్యాప్ ఇచ్చిన ముద్దుగుమ్మ తాజాగా మళ్లీ నటించడానికి సిద్ధం అయ్యారు. అయితే ఇప్పటికే పలు చిత్రాల్లో నటించనున్నట్లు ప్రచారం కూడా ముమ్మరంగా సాగింది.  
 
 అయితే తనకు అత్యంత ఇష్టమైన దర్శకులు సంజయ్ లీలా బన్సాలీ, మణిరత్నం అని ఐశ్వర్యా రాయ్ ప్రకటించారు. వీరిలో ఎవరో ఒకరి దర్శకత్వంలో మళ్లీ తెరంగేట్రం చేయాలని భావించిన ఐశ్వర్యారాయ్ సంజయ్ లీలా భన్సాలీ చిత్రం రామ్ లీలాలో ఒక పాటకు డ్యాన్‌‌స చేయాలని అడిగారు. అందుకామె ఆ పాటలోని కొన్ని పదాలను మార్చమని సూచించగా, అందుకు సంజయ్ లీలా బన్సాలీ నిరాకరించారు. దీంతో ఆ చిత్రం నుంచి ఐశ్వర్యా రాయ్ వైదొలిగారు. తాజాగా మణిరత్నం దర్శకత్వం వహించనున్న చిత్రంలో ఐశ్వర్యారాయ్ ప్రముఖ పాత్రను పోషించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారన్నది కోలీవుడ్  తాజా సమాచారం.