ఆ చిత్రంలో నటించడానికి ఇష్టపడలేదు

21 May, 2019 07:43 IST|Sakshi

చెన్నై : ఆ చిత్రంలో నటించడానికి తానే ఇష్టపడలేదని చెప్పింది షాక్‌ ఇచ్చింది నటి ఐశ్వర్యరాజేశ్‌. కాక్కముట్టై, వడచెన్నై వంటి పలు చిత్రాల్లో తన ఉత్తమ నటనాభినయాన్ని ప్రదర్శించి ప్రశంసలు అందుకున్న ఈ అమ్మడు తెలుగింటి ఆడపడుచు అన్నది తెలిసిందే. ఇటీవల కనా చిత్రంలో కథానాయకిగా నటించి సక్సెస్‌ కథానాయకిగా పేరు తెచ్చుకున్న ఐశ్వర్యరాజేశ్‌ కొన్ని చిత్రాల్లో ఎలాంటి ప్రాధాన్యత లేని పాత్రల్లో నటించి విమర్శలను ఎదుర్కొంది. ఈమె అలా నటించిన చిత్రాల్లో సామీ స్క్వేర్‌ ఒకటి.

విక్రమ్‌ హీరోగా కమర్షియల్‌ దర్శకుడు హరి తెరకెక్కించిన ఈ చిత్రం ఇంతకుముందు సంచలన విజయం సాధించిన సామి చిత్రానికి సీక్వెల్‌ అన్నది తెలిసిందే. నటి కీర్తీసురేశ్‌ కథానాయకిగా నటించిన ఈ చిత్రంలో మరో నాయకిగా మొదట నటి త్రిషను ఎంపిక చేశారు. అయితే ఆ తరువాత ఆమె ఈ చిత్రం నుంచి వైదొలగడంతో నటి ఐశ్వర్యరాజేశ్‌ను ఎంపిక చేశారు. కాగా ఇటీవల ఒక భేటీలో నటి ఐశ్వర్యరాజేశ్‌ మాట్లాడుతూ సామీ స్క్వేర్‌ చిత్రంలో నటించడానికి తాను ఇష్టపడలేదని చెప్పింది. అయితే నటుడు విక్రమ్, దర్శకుడు హరి పర్సనల్‌గా నటించమని కోరడంతో అంగీకరించినట్లు తెలిపింది. వేరే నటి ఈ పాత్రలో నటించడానికి ఒప్పుకోవడం లేదని దర్శక, కథానాయకుడు చెప్పడం కూడా తానందులో నటించడానికి ఒక కారణం అని ఐశ్వర్యరాజేశ్‌ చెప్పి ఆ చిత్ర వర్గాలకు షాక్‌ ఇచ్చింది. కాగా ఈ బ్యూటీ ఇప్పుడు కోలీవుడ్, టాలీవుడ్‌ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

మరిన్ని వార్తలు