రాజమండ్రి ఎండల్లో బాగా కష్టపడ్డా

23 Aug, 2019 00:30 IST|Sakshi
ఐశ్వర్యా రాజేష్‌

‘‘నేను పుట్టింది, పెరిగింది చెన్నైలోనే. 25 తమిళ్, 2 మలయాళం, ఒక హిందీ సినిమా చేశా. ఇంత బాగా తెలుగు మాట్లాడుతున్నారని చాలామంది అడుగుతుంటారు. మా నాన్న రాజేష్‌గారు ‘మల్లె మొగ్గలు, రెండు జళ్ల సీత, ‘అలజడి’ వంటి ఎన్నో చిత్రాల్లో నటించారు. మా అత్త శ్రీలక్ష్మిగారు కమెడియన్‌గా అందరికీ సుపరిచితురాలు. మా తాత అమర్‌నాథ్‌గారు కూడా తెలుగులో మంచి నటుడిగా గుర్తింపు పొందారు. మేం తెలుగువాళ్లమే’’ అని ఐశ్వర్యా రాజేష్‌ అన్నారు.  రాజేంద్రప్రసాద్, కార్తీక్‌ రాజు, ‘వెన్నెల’ కిషోర్‌ ముఖ్య పాత్రల్లో ఐశ్వర్యా రాజేష్‌ లీడ్‌ రోల్‌లో భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి.. ది క్రికెటర్‌’. కె.యస్‌.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఐశ్వర్యా రాజేష్‌ చెప్పిన విశేషాలు.

► తమిళ్‌లో నా పాత్రలన్నీ పెర్‌ఫార్మెన్స్‌ ఓరియంటెడ్‌గా ఉంటాయి. తెలుగులో కూడా మంచి సినిమాతో పరిచయం అవ్వాలని తాపత్రయపడేదాన్ని. ‘కౌసల్య కృష్ణమూర్తి’ లాంటి ఓ మంచి సినిమాతో పరిచయమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. తమిళంలో నేను లీడ్‌ రోల్‌ చేసిన ‘కణ’కి ఇది రీమేక్‌. తమిళ ప్రేక్షకుల్లా తెలుగు ప్రేక్షకులు కూడా మంచి విజయాన్ని ఇస్తారనే నమ్మకం ఉంది.  

► రాజేంద్రప్రసాద్‌గారు మా నాన్నగారికి మంచి ఫ్రెండ్‌. ఆయనతో నటిస్తున్నప్పుడు మా నాన్నగారి గురించి చాలా విషయాలు నాతో షేర్‌ చేసుకున్నారు. కె.యస్‌. రామారావుగారు పట్టుబట్టి ఈ సినిమా బాగా రావడానికి తోడ్పాటునందించారు. ఈ సినిమా మా అందరికీ ఒక మంచి తీపిగుర్తుగా నిలుస్తుంది.

► క్రికెట్‌కి మంచి ప్రాధాన్యం ఉన్న సినిమా కాబట్టి ఆ ఫీల్‌ పోకూడదని ఫీమేల్‌ కోచ్‌ని పెట్టుకొని ప్రాక్టీస్‌ చేశాను. అలా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌ నేర్చుకున్నాను. తమిళ్‌లో ఎలాగైతే రోజుకి ఎనిమిది గంటలు ఎండలో కష్టపడ్డానో.. తెలుగుకి కూడా రాజమండ్రి ఎండల్లో బాగా కష్టపడ్డాను. ఇంత కష్టపడ్డాను కాబట్టి తెలుగులో మంచి పేరు వస్తుందనుకుంటున్నా. ప్రస్తుతం ‘కౌసల్య కృష్ణమూర్తి’ కోసం ఎగై్జటింగ్‌గా ఎదురు చూస్తున్నా. క్రియేటివ్‌ కమర్షియల్‌ బ్యానర్‌లోనే క్రాంతిమాధవ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ సరసన నటిస్తున్నాను. అలాగే నేను నటించిన మరో చిత్రం ‘మిస్‌ మ్యాచ్‌’ త్వరలో విడుదలవుతుంది.

మరిన్ని వార్తలు