అజయ్‌ దేవగణ్‌పై మండిపడుతున్న నెటిజన్లు

2 Apr, 2019 20:01 IST|Sakshi

మీటూ ఉద్యమం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినీ పరిశ్రమలో పెద్దలుగా చెలామణి అవుతోన్న వారి మీద లైంగిక వేదింపుల ఆరోపణలు రావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఇలా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో కలిసి పనిచేయకూడదని ఇండస్ట్రీలో నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇలా బహిష్కరించిన వారిలో అలోక్‌ నాథ్‌ కూడా ఉన్నారు. అయితే తాజాగా ఈయన అజయ్‌ దేవగణ్‌  ‘దే దే ప్యార్‌ దే’ చిత్రంలో నటించారు. ఈ రోజు చిత్ర ట్రైలర్‌ విడుదల సందర్భంగా ఈ విషయం తెలిసింది. దీని గురించి అజయ్‌ దేవగణ్‌ని ప్రశ్నించగా.. ‘ఈ విషయం గురించి మాట్లాడ్డానికి ఇది సరైన వేదిక కాదు. కానీ అతని మీద ఆరోపణలు వచ్చే నాటికే ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయ్యింది’ అని తెలిపారు.

అయితే అజయ్‌ సమాధానంపై నెటిజన్లు మండిపడుతున్నారు. అజయ్‌ మీకు ఓ భార్య, కూతురు ఉన్నారు కదా. అలాంటప్పుడు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని మీ చిత్రంలో ఎలా ఉంచుతారు. ఇలాంటి వ్యక్తికి మద్దతిస్తున్నందుకు మీరు సిగ్గుపడాలి. అలోక్‌ నాథ్‌ సన్నివేశాలు తొలగించాలి.. లేదా వేరే వ్యక్తితో ఆ పాత్రలో నటింపజేయాలి.. లేదంటే ఈ సినిమాను థియేటర్‌లో కాదు కదా కనీసం టీవీలో కూడా చూడమంటూ పలువురు నెటిజన్లు​ కామెంట్‌ చేస్తున్నారు. గతంలో ఆమిర్‌ ఖాన్‌తో పాటు మరికొందరు బాలీవుడ్‌ నటులు మీటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో కలిసి నటించేది లేదని తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు