కూతుర్ని విమర్శించే వారిపై స్పందించిన అజయ్‌ దేవగన్‌

11 Jun, 2019 11:17 IST|Sakshi

పనీపాటా లేక ఖాళీగా ఉన్న వారే చెత్త వాగుడు వాగుతారు. అలాంటి వాటిని నేను కానీ నా కూతురు కానీ పట్టించుకోం అంటున్నారు బాలీవుడ్‌ స్టార్‌ హీరో అజయ్‌ దేవగన్‌. కాజోల్‌ - అజయ్‌ దేవగన్‌ల కూతురు నైసా బాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వకపోయినప్పటికి పాపులారిటీ మాత్ర విపరీతంగా ఉంటుంది.  ఆమెకు సంబంధించిన ఫోటోలు, వార్తలు ఇంటర్నెట్‌లో తెగ వైరలవుతుంటాయి. ఈ ఫోటోలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తుంటారు. విమర్శలు కూడా చేస్తుంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కూతరురిపై వచ్చే విమర్శలపై స్పందించారు అజయ్‌ దేవగణ్‌. ‘ఇలాంటి పనులు చేసే వారికి బుర్ర ఉండదు. పనీపాటా లేక ఖాళీగా ఉండి ఇలాంటి కామెంట్లు చేస్తుంటారు. అది కూడా నకిలీ ఖాతాల నుంచి. ఇలాంటి పిరికి వారి మాటలను నేను కానీ.. నా కూతురు కానీ పట్టించుకోం. వాటికి అసలు ప్రాధాన్యమే ఇవ్వం’ అని తెలిపారు.

అంతేకాక తమ పిల్లలు చాలా చిన్నవారని.. ప్రస్తుతం చదువు గురించి తప్ప వారికి మరే ఇతర ఆలోచనలు లేవని వెల్లడించారు అజయ్‌. ఒక వేళ వారు సినిమాలోకి రావాలనుకుంటే.. అది వారి ఇష్టమని.. తన బలవంతం ఏం ఉండదని స్పష్టం చేశారు. ‘ఈ కాలం పిల్లలు అన్ని విషయాల్లో చాలా ఫాస్ట్‌గా ఉన్నారు. ఇంటర్నెట్‌, టీవీల ద్వారా వారికి సంబంధించిన అన్ని విషయాల గురించి చాలా సులభంగా తెలుసుకుంటున్నారు. టెక్నాలజీని వాడటంలో కూడా వారు చాలా ముందన్నారు. ఎప్పుడైనా నా ఫోన్‌ సరిగా పని చేయకపోతే.. నా కొడుకు యగ్‌ దగ్గరకు తీసుకెళ్తాను. వాడు చాలా సులభంగా దాన్ని రిపేర్‌ చేస్తాడు’ అని తెలిపారు అజయ్‌ దేవగన్‌.

మరిన్ని వార్తలు