‘వివేకం’ హీరో అజిత్‌పై విశాల్‌ అసహనం..

30 Apr, 2018 12:48 IST|Sakshi
విశాల్‌, అజిత్‌

సాక్షి, చెన్నై: తమిళ సినిమా స్టార్‌ అజిత్‌పై హీరో, తమిళ నిర్మాతల మండలి చైర్మన్‌ విశాల్‌ అసహనం వ్యక్తం చేశారు. గత నెలలో కావేరీ వాటర్‌ బోర్డు ఏర్పాటుపై తమిళ సినిమా రంగం కేంద్రంపై మౌన పోరాట దీక్షలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ నిరసనల్లో అజిత్‌ పాల్గొనక పోవడంపై విశాల్‌ స్పందించారు. విశాల్‌ ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘అజిత్‌ ఎప్పుడూ అందుబాటులో ఉండడు’ అంటూ వ్యాఖ్యానించారు. అజిత్‌ వ్యవహారం ఇబ్బందిగా అనిపించిందని అన్నారు. ‘ఒక అంశంపై నేను అజిత్‌ను కలవాల్సి ఉండగా, ఆయన పీఆర్‌ఓ సురేష్‌ చంద్రను సంప్రదించాను. కానీ అజిత్‌ని మాత్రం కలవలేపోయాన’ని విశాల్‌ వాపోయారు.

‘స్కూలు హెడ్‌ మాస్టారిలా సమావేశానికి అందరూ హాజరు కావాలని హుకుం జారీ చేయలేన’ని అన్నారు. కొన్ని వ్యవహరాలలో ఎవరికి వారు నైతికంగా జోక్యం చేసుకొని పాల్గొనాలని అభిప్రాయపడ్డారు. సినిమా ప్రమోషన్లలో భాగంగా కొత్త కొత్త పోకడలతో నటీనటులంతా ప్రజలకు చేరువవుతున్న నేటి తరుణంలో.. అజిత్‌ అలాంటి వాటికి దూరంగా ఉండడం గమనార్హం. కాగా, గతంలో తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న అజిత్‌ సినిమా తారలపై ప్రభుత్వ ఒత్తిడిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కావేరి జల వివాదంపై పోరాడాలని సినిమా రంగంపై అనుచిత ఒత్తిడి తెస్తున్నారని వ్యాఖ్యానించి వార్తల్లో నిలిచారు. అజిత్‌ వ్యాఖ్యల్నిసూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కూడా సమర్థించారు.

మరిన్ని వార్తలు