10న సినిమా రిలీజ్‌, తిరుమలకు హీరో

18 Jul, 2017 16:19 IST|Sakshi
తిరుమలలో హీరో అజిత్‌

తిరుమల:  ప్రముఖ తమిళ హీరో అజిత్‌ మంగళవారం కలియుగ వైకుంఠ దైవం శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం వీఐపీ ప్రారంభ దర్శనంలో స్వామివారి సేవలో ఆయన పాల్గొన్నారు. అజిత్‌కు తితిదే అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయ అధికారులు దగ్గరుండి దర్శనం చేయించారు. వేద పండితులు ఆశీర్వచనం అందించి స్వామి వారి తీర్దప్రసాదాలను అందించారు.

ఈ సందర్భంగా అజిత్ మాట్లాడుతూ.. స్వామి వారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. మరోవైపు దర్శనం అనంతరం అజిత్‌తో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు. తెల్ల షర్ట్‌, పంచెలో అజిత్‌ కూల్‌గా కనిపించారు. కాగా అజిత్‌ తాజా చిత్రం ‘వివేగం’ వచ్చే నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ఆయన ఇంటర్‌పోల్‌ ఏజెంట్‌కు కనిపించనున్నారు. అలాగే హీరోయిన్లుగా కాజల్‌ అగర్వాల్‌, అక్షర హాసన్‌ నటించారు. అజిత్‌ తన ప్రతి సినిమా విడుదలకు ముందు తిరుమల వచ్చి స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీ అని ఆయన సన్నిహితులు తెలిపారు. స్వామివారి దర్శనం కోసం అజిత్‌ సోమవారం సాయంత్రమే తిరుమల చేరుకున్నారు.