బోనీతో మరో సినిమా!

31 Jul, 2019 11:18 IST|Sakshi

కోలీవుడ్ నటుడు అజిత్‌ కుమార్‌, దివంగత బాలీవుడ్ నటి శ్రీదేవి కుటుంబాల మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అందుకే శ్రీదేవి రీ ఎంట్రీ సినిమా ఇంగ్లీష్ వింగ్లీష్‌లో అజిత్‌ అతిథి పాత్రలో కనిపించి అలరించారు. అదే సమయంలో అజిత్‌ హీరోగా తన భర్త బోనీ కపూర్‌ నిర్మాణంలో ఓ సినిమా చేయాలని భావించారు శ్రీదేవి.

తరువాత శ్రీదేవి మరణించినా బోనీ మాత్రం ఆమె అనుకున్నట్టుగా అజిత్‌ హీరోగా సినిమాను నిర్మించారు. బాలీవుడ్‌లో ఘనవిజయం సాధించిన పింక్ సినిమాను కోలీవుడ్‌లో నీర్కొండ పార్వై పేరుతో రీమేక్‌ చేశారు. అంతేకాదు అజిత్ హీరోగా మరో సినిమాను కూడా నిర్మించేందుకు రెడీ అవుతున్నారు బోనీ‌. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా పేజ్‌లో అధికారికంగా ప్రకటించారు.

కోలీవుడ్ దర్శకుడు హెచ్‌ వినోద్ దర్శకత్వంలో అజిత్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాను బోనీ కపూర్‌ తన బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. కోలీవుడ్ నిర్మాతలు అజిత్‌తో సినిమా చేసేందుకు క్యూ కడుతున్నా కేవలం శ్రీదేవి మీద ఉన్న అభిమానంతో అజిత్‌, బోనితో మరో సినిమా చేసేందుకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది.

మరిన్ని వార్తలు