రాజకీయాలకు నో!

30 May, 2019 09:57 IST|Sakshi

సినీరంగంలోనూ, వ్యక్తిగతంగానూ వివాదాలకు దూరంగా ఉండే నటుడు అజిత్‌. ఇక రాజకీయాల దరిదాపులకే వెళ్లని వ్యక్తి. ఇటీవల బీజేపీ నటుడు అజిత్‌ను రాజకీయాల్లోకి లాగే ప్రయత్నం చేసి విఫలమైన విషయం పెద్ద దుమారాన్నే  రేపింది.కాగా సినిమాల్లోనూ రాజకీయాలకు ఇష్టపడని నటుడు అజిత్‌. తన తాజా చిత్ర కథ రాజకీయ నేపథ్యంతో కూడి ఉండడంతో ఆ కథను పక్కన పెట్టేశారన్న విషయం తెలిసింది.

అజిత్‌ ప్రస్తుతం నేర్కొండ పార్వై చిత్రాన్ని పూర్తి చేశారు. ఇది హిందీ చిత్రం పింక్‌కు రీమేక్‌ అన్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌ నిర్మాత, దివంగత నటి శ్రీదేవి భర్త బోనీకపూర్‌ నిర్మిస్తున్న చిత్రం ఇది. నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న నేర్కొండ పార్వై చిత్రానికి హెచ్‌.వినోద్‌ దర్శకుడు. దీన్ని ఆగస్ట్‌ 10న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దీంతో అజిత్‌ తన 60వ చిత్రానికి రెడీ అవుతున్నారు. మరోసారి దర్శకుడు హెచ్‌.వినోద్‌కే అవకాశం ఇచ్చారు.

దీంతో ఆయన అజిత్‌కు రెండు కథలను వినిపించారట. అందులో ఒకటి రాజకీయ నేపథ్యంతో కూడిన కథ కాగా, మరొకటి సామాజిక సమస్యతో కూడిన యాక్షన్‌ కథా చిత్రం అని తెలిసింది. కాగా అజిత్‌ రాజకీయ నేపథ్యంతో కూడిన కథను పక్కన పెట్టి సామాజిక సమస్యతో కూడిన యాక్షన్‌ కథా చిత్రానికి ఓకే చెప్పారట. సామాజిక సమస్యకు చక్కని పరిష్కారం చూసే కథ అజిత్‌కు బాగా నచ్చేసిందట.

మరో విశేషం ఏమిటంటే ఇందులో అజిత్‌ పోలీస్‌ అధికారిగా నటించబోతున్నారట. ఈయన పోలీస్‌ అధికారిగా నటించి చాలా కాలమైంది. కాబట్టి వినోద్‌ దర్శకత్వంలో నటించనున్న తాజా చిత్రంతో అజిత్‌ అభిమానులకు ఖుషీనే. కాగా ఈ పాత్ర కోసం అజిత్‌ స్లిమ్‌గా తయారవడానికి వర్కౌట్‌ చేస్తున్నారట. ఈ చిత్రానికి జిబ్రాన్‌ సంగీతాన్ని అందించనున్నారు. నిర్మాత బోనీకపూర్‌నే ఈ క్రేజీ చిత్రాన్ని నిర్మించనున్నారని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.

మరిన్ని వార్తలు