నవ్వించే ‘ఏకే రావ్ పీకే రావ్’

15 Feb, 2014 00:34 IST|Sakshi
నవ్వించే ‘ఏకే రావ్ పీకే రావ్’

హాస్యనటులుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ధన్‌రాజ్, తాగుబోతు రమేష్ ‘ఏకే రావ్ పీకే రావ్’ చిత్రంతో హీరోలుగా మారారు. సాయివెంకటేశ్వర కంబైన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి కోటపాటి శ్రీను దర్శకత్వం వహించారు. కేఎస్సార్ స్వరపరచిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. పాటల సీడీని నాని ఆవిష్కరించి, దామోదరప్రసాద్, నందినీరెడ్డికి ఇచ్చారు. ఈ చిత్రం ద్వారా ధన్‌రాజ్, తాగుబోతు రమేష్ కెరీర్ మరింత పుంజుకోవాలని, తమ సంస్థ ద్వారా తాగుబోతు రమేష్‌కి బ్రేక్ రావడం ఆనందంగా ఉందని దామోదరప్రసాద్ అన్నారు. తను నటించిన అలా మొదలైంది, ఈగ, భీమిలి కబడ్డీ చిత్రాల్లో ధన్‌రాజ్, తాగుబోతు రమేష్ చేశారనీ, ఈ ఇద్దరూ హీరోలుగా నటించిన ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని నాని చెప్పారు. ధన్‌రాజ్, రమేష్ కష్టపడే తత్వం ఉన్నవారని, ఈ చిత్రం బాగా ఆడి నిర్మాతకు లాభాలు రావాలని శివాజి తెలిపారు.
 
 ఓ ఏరియాలో ఈ సినిమాని పంపిణీ చేస్తున్నానని సురేష్ కొండేటి అన్నారు. టైటిల్ రోల్స్‌ని భుజాన మోయగలమనే నమ్మకం కుదరడం, కథలో వినోదం ఉండటంతో ఈ సినిమా చేశామని ధన్‌రాజ్, తాగుబోతు రమేష్ చెప్పారు. ఇంకా నందినీరెడ్డి, మారుతి, ప్రిన్స్, డీయస్ రావు, బెక్కెం వేణుగోపాల్ తదితరులు సినిమా విజయం సాధించాలనే ఆకాంక్షను వెలిబుచ్చారు.