అఖిల్ బాలీవుడ్‌ ఎంట్రీ!

25 Aug, 2018 10:01 IST|Sakshi

అక్కినేని నట వారసుడిగా భారీ అంచనాల మధ్య సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో అఖిల్. తొలి సినిమాతో నిరాశపరిచిన అఖిల్, రెండో ప్రయత్నంగా తెరకెక్కిన హలోతో పరవాలేదనిపించాడు. ప్రస్తుతం తొలి ప్రేమ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు. నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న షూటింగ్ విదేశాల్లో జరుగుతోంది.

ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే అఖిల్ తదుపరి చిత్రానికి సంబంధించి ఆసక్తికర వార్త ఒకటి టాలీవుడ్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. అఖిల్‌ తన నెక్ట్స్ సినిమాతో బాలీవుడ్‌ ఎంట్రీకి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. నటుడు ఆది పినిశెట్టి సోదరుడు సత్య ప్రభాస్‌ దర్శకత్వంలో అఖిల్ సినిమా చేస్తున్నాడన్న టాక్‌ చాలా రోజులుగా వినిపిస్తోంది.

మలుపు సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సత్య ప్రభాస్‌ తన నెక్ట్స్ సినిమాను భారీగా ప్లాన్ చేస్తున్నాడు. అఖిల్ హీరోగా తెలుగు, హిందీ భాషల్లో ఓ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్‌ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కింగ్ నాగార్జున, కరణ్‌ జోహర్‌లు సంయుక్తంగా ఈ సినిమా నిర్మించనున్నారట. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన లేకపోయినా, అఖిల్‌ బాలీవుడ్ ఎంట్రీపై జోరుగా ప్రచారం జరుగుతోంది.

మరిన్ని వార్తలు