'మనం' విడుదల తర్వాతే అఖిల్ ఆరంగేట్రం: నాగార్జున

4 Mar, 2014 12:25 IST|Sakshi
'మనం' విడుదల తర్వాతే అఖిల్ ఆరంగేట్రం: నాగార్జున

తన తండ్రితోను, కొడుకుతోను కలిసి నటించిన 'మనం' చిత్రం విడుదలైన తర్వాతే.. అఖిల్ సినీరంగ ప్రవేశం ఉంటుందని అక్కినేని నాగార్జున తెలిపారు. తన తండ్రి నాగేశ్వరరావుతోను, కొడుకు నాగచైతన్యతోను కలిసి 'మనం' చిత్రంలో నటించడం చాలా అద్భుతమైన అనుభవమని ఆయన అన్నారు. ఇటీవలే కన్నుమూసిన అక్కినేని నాగేశ్వరరావుకు 'మనం' చిట్టచివరి చిత్రం అన్న సంగతి తెలిసిందే.

ఇది పూర్తిగా వినోదభరితమైన చిత్రమని, ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని నాగ్ అన్నారు. తన నటజీవితంలోనే ఇలాంటి సాహసోపేతమైన పయనం ఎప్పుడూ చేయలేదని, ఒకేసారి ఒకే సినిమాలో తన తండ్రితోను.. తన కొడుకుతోను కలిసి తాను నటించిన ఏకైక చిత్రం ఇదేనని చెప్పారు. ఈ విషయాన్ని ఆయన తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈనెల 31వ తేదీన ఉగాది సందర్భంగా విడుదల కానుంది. ఈ సినిమాలో ఇంకా సమంత, నీతూ చంద్ర ప్రధాన పాత్రల్లో నటించారు. మనం విడుదలైన తర్వాత మాత్రమే అఖిల్ సినీరంగ ఆరంగేట్రం చేస్తాడని కూడా నాగార్జున చెప్పారు.

>