అవార్డు కొనలేదు

8 Apr, 2017 00:45 IST|Sakshi
అవార్డు కొనలేదు

‘‘ఈ అవార్డును నేను నిజాయితీతో సంపాదించుకున్నాను. నేనిప్పటివరకూ మోసం చేయలేదు. అవార్డు కోసం ఎవరికైనా ఫోన్‌ చేయడం గాని, నాకు ఫేవర్‌ చేయమని డబ్బులు ఇవ్వడం గానీ చేయలేదు’’ అన్నారు హిందీ హీరో అక్షయ్‌ కుమార్‌. జాతీయ ఉత్తమ నటుడిగా అక్షయ్‌కు అవార్డు ఇవ్వడంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అంతకు ముందు అవార్డు పట్ల అక్షయ్‌ సంతోషం వ్యక్తం చేశారు.

‘‘ఈ అవార్డును నా పేరెంట్స్, ఫ్యామిలీ, నా వైఫ్‌ (ట్వింకిల్‌ ఖన్నా)కు అంకితం చేస్తున్నాను. ‘మీరు అవార్డు ఫంక్షన్లకు వెళ్లడం మానేశారా? మీకెప్పుడైనా అవార్డు వస్తుందా?’ అని ట్వింకిల్‌ అన్నప్పుడు బాధగా అనిపించేది. ఇప్పుడు హ్యాపీ. అవార్డ్స్‌ కమిటీ జ్యూరీ, ఫ్యాన్స్, అందరికీ థ్యాంక్స్‌’’ అన్నారు అక్షయ్‌. అన్నట్టు... జాతీయ ఉత్తమ హిందీ చిత్రం ‘నీర్జా’లోని నటనకు స్పెషల్‌ జ్యూరీ అవార్డు అందుకున్న సోనమ్‌కపూర్‌తో కలసి అక్షయ్‌ ‘పాడ్‌మ్యాన్‌’ అనే సినిమా చేస్తున్నారు. జాతీయ అవార్డులు ప్రకటించినప్పుడు వీరిద్దరూ ఆ సినిమా లొకేషన్‌లోనే ఉన్నారు.

>