బాలీవుడ్ బొద్దుగుమ్మ సోనాక్షి సిన్హా ప్రస్తుతం గ్లామర్ పాఠాలు నేర్చుకుంటున్నారట. ఈ అందాల బొమ్మకు గ్లామర్ పాఠాలు నేర్పుతోంది ఎవరా అనుకుంటున్నారా? తనెవరో కాదు... బాలీవుడ్ సూపర్స్టార్ అక్షయ్కుమార్. వీరిద్దరూ కలిసి నటించిన ‘వన్స్ అపాన్ ఏ టైమ్ ముంబయ్’ చిత్రం ఆగస్ట్ 15న విడుదల కానుంది.
ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లో పాల్గొంటూ ఈ జంట చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఈ నేపథ్యంలో వీరిద్దరిపై బాలీవుడ్ మీడియాలో ఓ గాసిప్ హల్చల్ చేస్తోంది. ‘వన్స్ అపాన్ ఏ టైమ్ ముంబయ్’ చిత్రం విడుదల పనులు ఓ వైపు, వీరిద్దరూ కలిసి నటిస్తున్న ‘పిస్తోల్’ చిత్రం షూటింగ్ హడావిడి ఓ వైపు. దీంతో ఈ జంటకు క్షణం తీరిక దొరకడం లేదంట.
ఎక్కువ శాతం ఇద్దరూ కలిసే గడుపుతున్నారని టాక్. ఈ సందర్భంలోనే... సోనాక్షికి కాస్తంత గ్లామర్ డోస్ పెంచమని అక్షయ్ సూచించారని విశ్వసనీయ వర్గాల భోగట్టా. ‘పిస్తోల్’లో తాను నటించనున్న పాత్రను దృష్టిలో పెట్టుకొనే అక్షయ్... ఆ విధంగా సూచించారని సమాచారం. అందుకే ఇప్పటివరకూ ఎక్కువ శాతం నిండుగానే కనిపించిన సోనాక్షి... ‘పిస్తోల్’ చిత్రంలో మాత్రం గ్లామర్ డోస్ అనూహ్యంగా పెంచేశారట.
ఇటీవల ముంబయ్లో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో సోనాక్షి మాట్లాడుతూ -‘‘గ్లామర్కీ ఎక్స్పోజింగ్కీ చాలా తేడా ఉంది. నేను ఇక నుంచి గ్లామర్గా కనిపించాలనుకుంటున్నాను. నా దృష్టిలో గ్లామర్గా కనిపించడం అంటే... స్టైలిష్గా కనిపించడమే. నటిగా మరో అడుగు ముందుకెళ్లాలంటే... కొన్ని సాహసాలు చేయాలి మరి’’ అంటూ చెప్పారు. ఈ మాటలు విన్న వారందరూ ఆక్షయ్ నీతిబోధలు బాగానే పనిచేశాయని చెవులు కొరుక్కుంటున్నారని వినికిడి.