సెన్సార్‌ పూర్తి.. ఇక సంక్రాంతికి సంబరాలే

3 Jan, 2020 16:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, పూజ హెగ్డే జంటగా తెరకెక్కిన చిత్రం ‘అల.. వైకుంఠపురములో..’. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమా సెన్సార్‌ ప్రక్రియను పూర్తి చేసుకొంది. ఈ చిత్రాన్ని వీక్షించిన సెన్సార్‌ బృందం... యూ/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. ‘సెన్సార్‌ పూర్తయింది. గతంలో ఎన్నడూలేనివిధంగా ఈ సంక్రాంతికి భారీ సంబరాలతో మేం సిద్ధమవుతున్నాం. పండుగ సరదాల కోసం మేం మిమ్మల్ని మీ కుటుంబంతో సహా థియేటర్లకు ఆహ్వానిస్తున్నాం. డోన్ట్‌ మిస్‌’ అంటూ గీతా ఆర్ట్స్‌ తన ట్విటర్‌ ఖాతాలో ఈ విషయాన్ని ట్వీట్‌ చేసింది. అయితే, వినూత్నంగా రిలీజ్‌ చేసిన సెన్సార్‌ సర్టిఫికేట్‌ పోస్టర్‌లోనూ సినిమా విడుదల తేదీని చిత్రయూనిట్‌ వెల్లడించలేదు. ఈ నెల 12న సినిమా విడుదల కానున్నట్టు గతంలో ప్రకటించారు. అయితే, కొత్త సంవత్సరం సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో, తాజాగా రిలీజ్‌ చేసిన పోస్టర్‌లోనూ రిలీజ్‌ డేట్‌ లేదు. జస్ట్‌ సంక్రాంతి రిలీజ్‌ అని మాత్రమే మెన్షన్‌ చేశారు. దీంతో విడుదల తేదీపై కొంత సందిగ్ధం నెలకొందనే టాక్‌ సోషల్‌ మీడియాలో వినిపిస్తోంది.

క్రియేటివ్‌ డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని.. అల్లు అరవింద్, ఎస్‌. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. సుశాంత్, నివేదా పేతురాజ్, టబు, జయరామ్‌ తదితరులు ఈ చిత్రంలో కీలక​ పాత్రల్లో నటించారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మూవీ ‘మ్యూజికల్‌ కాన్సెర్ట్‌’ (ప్రీ రిలీజ్ వేడుక) జనవరి 6వ తేదీన యుసఫ్‌ గూడ పోలీస్‌ గ్రౌండ్‌లో జరగనుంది. ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కు సంబంధించి కర్టెన్‌ రైజర్‌ వీడియోను తాజాగా విడుదల చేశారు. ఈ వీడియోలో పోతన భాగవతంలో రచించిన ‘అల వైకుంఠపురములో..’ పాటను గాయనీమణులు ఆలపించారు.
చదవండి: అల.. వైకుంఠపురములో.. ‘దోశ స్టెప్పు’​

మరిన్ని వార్తలు