బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్న బన్నీ సినిమా

22 Jan, 2020 18:15 IST|Sakshi

స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ సినిమా అల వైకుంఠపురములో అందరి అంచనాలను దాటుకుని బ్లాక్ బస్టర్ స్థాయిని అందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లను రాబడుతూ.. బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తుంది. విడుదలైన 10 రోజుల్లోనే 200 కోట్ల క్లబ్‌లో చేరింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటికే రూ.220  కోట్లు (గ్రాస్‌) రాబట్టింది. ఇది ఆల్‌టైం రికార్డు అని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. విడుదలైన 10 రోజుల్లోనే రూ.143 కోట్లు(షేర్స్‌) వసూలు చేసినట్లు చెప్పారు. ఇది నాన్‌ బాహుబలి రికార్డు అని పేర్కొన్నారు.

ఏపీ, తెలంగాణ‌లో మొత్తం 10 రోజుల్లో 112.90 కోట్లు కొల్లగొట్టింది. నైజాంలో రూ.35.69 కోట్లు, సీడెడ్‌లో రూ.18.07 కోట్లు, వైజాగ్ 18.80 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.9.89 కోట్లు. పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.7.65 కోట్లు, గుంటూరులో రూ.9.93 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.8.80 కోట్లు ,నెల్లూరులో రూ.4.07 కోట్లు వసూలు అయ్యాయి. ఇక పోతే కర్ణాటకలో 10.70 కోట్లు, తమిళనాడు, కేరళ & రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 3.60 కోట్లు, యూఎస్ 12.50 కోట్లు, రెస్ట్ ఆఫ్ వరల్డ్ 3.55 కోట్లు.. మొత్తంగా చూస్తే ప్రపంచవ్యాప్తంగా 143.25 కోట్ల షేర్, 220 కోట్ల గ్రాస్ వసూలు చేసి టాలీవుడ్‌లో రికార్డును సృష్టించింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్డే నటించింది. అల్లు అరవింద్‌, రాధాకృష్ణలు సంయుక్తంగా నిర్మించారు. థమన్‌ సంగీతం అందించారు.

మరిన్ని వార్తలు