హైదరాబాద్ : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్ధేశకత్వంలో తెరకెక్కుతున్న అలవైకుంఠపురములో ప్రీ రిలీజ్ రికార్డుల పరంపర కొనసాగుతోంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే బయటకు వదిలిన రెండు పాటలు సామజవరగమన, రాములో రాములా రికార్డ్ వ్యూస్ను సాధించగా ఈ రెండు పాటలూ కలిపి యూట్యూబ్లో 200 మిలియన్ వ్యూస్ రాబట్టాయి. ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ ఈ రికార్డుకు వేదికైంది. సెప్టెంబర్ 27న అలవైకుంఠపురములో తొలి పాట సామజవరగమన ఇలా బయటకు రాగానే కేవలం 65 రోజుల్లో 100 మిలియన్ వ్యూస్ను దక్కించుకుంది.
ఇప్పటివరకూ ఈ పాటను 11 కోట్ల మందికి పైగా వీక్షించగా 11 లక్షల మంది లైక్ చేశారు. ఇక సరిగ్గా నెలరోజుల పాటు ఈ పాట యూట్యూబ్ను ఊపేసిన అనంతరం ఇదే సినిమాలోని రెండవ పాట రాములో రాముల అక్టోబర్ 27న విడుదలై 54 రోజుల్లోనే 100 మిలియన్ మార్క్ను దాటేసింది. అలవైకుంఠపురములో మ్యూజిక్ను కంపోజ్ చేసిన థమన్ ఎస్ తన పాటలకు భారీ విజయం దక్కడంతో ఫుల్ జోష్లో ఉన్నారు. ఇక సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీతో బన్నీ, త్రివిక్రమ్లు మరెన్ని మ్యాజిక్లు క్రియేట్ చేస్తారో చూడాలి.