అల వైకుంఠపురములో అప్‌డేట్‌ వాయిదా.. ఎందుకంటే..

8 Dec, 2019 11:17 IST|Sakshi

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అభిమానులకు నిరాశ ఎదురైంది. తివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌, పూజా హెగ్డే జంటగా ‘అల వైకుంఠపురములో’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన మూడు లిరికల్‌ సాంగ్స్‌కు విశేష స్పందన వచ్చింది. అయితే ఈ మూవీ టీజర్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను ఆదివారం ప్రకటించనున్నట్టు చిత్రబృందం తెలిపింది. దీంతో బన్నీ అభిమానులు టీజర్‌ ఎప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే తాజాగా అల వైకుంఠపురములో టీజర్‌ అప్‌డేట్‌ను వాయిదా వేస్తున్నట్టు గీతా ఆర్ట్స్‌ ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ మెగా ఫ్యాన్స్ ప్రెసిడెంట్ నూర్‌ భాయ్‌ మృతిచెందడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపింది. త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలను ప్రకటిస్తామని పేర్కొంది. కాగా, మెగా హీరోలందరితో నూర్‌ భాయ్‌కి మంచి అనుబంధం ఉంది. 

‘తమ కుటుంబ సభ్యుల్లో ఒకడైన నూర్‌ భాయ్‌ మరణం కలచివేసింది. ఇటువంటి విషాద సమయంలో అల వైకుంఠపురములో టీజర్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను ప్రకటించడం సరైనది కాదని భావిస్తున్నాం. త్వరలోనే టీజర్‌కు సంబంధించిన వివరాలను ప్రకటిస్తామ’ని గీతా ఆర్ట్స్‌ పేర్కొంది. కాగా, అల్లు అరవింద్, ఎస్‌. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 12న విడుదల కానుంది.


 

మరిన్ని వార్తలు